DailyDose

‘భారతీయుల ఆయుష్షు ఐదేళ్లు కట్​!’.. కారణం ఇదే…

‘భారతీయుల ఆయుష్షు ఐదేళ్లు కట్​!’.. కారణం ఇదే…

భారతీయుల ఆయుష్షు ఐదేళ్లు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి కరోనానో మరో ఇతర వైరసో కారణం కాదు. మానవుడి స్వయంకృతాపరాధమే మనిషి ఆయుష్షును మింగేస్తోంది. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.

భారతీయుడి ఆయుష్షు ప్రమాదంలో పడింది. దేశపౌరుడి జీవిత కాలం ఐదేళ్లు తగ్గనుంది. దీనికి కారణం కరోనానో లేదా వేరే ఇతర మహమ్మారో కాదు. మనిషి స్వయంకృతాపరాధమే. మానవచర్యల వలన పెరుగుతున్న వాయు కాలుష్యం కోరలు చాచి సగటు మనిషి జీవిత కాలాన్ని హరించివేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటించకుంటే వాయు కాలుష్యం కారణంగా భారత్‌లో నివసించే వారి జీవిత కాలం సగటున ఐదేళ్లు తగ్గనుంది. ఈ కఠోర వాస్తవాన్ని షికాగో యూనివర్సిటీలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన వాయునాణ్యత సూచీ వెల్లడించింది

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా పేరొందిన రాజధాని దిల్లీలో వాయునాణ్యతపై నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. దిల్లీలో వాయుకాలుష్యం డబ్ల్యూహెచ్​వో ప్రమాణాల కంటే 21 రెట్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఇదే స్థాయిలో వాయుకాలుష్యం కొనసాగితే దిల్లీ వాసుల జీవిత కాలం పదేళ్లు తగ్గుతుందని అంచనా వేసింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకారం 130కోట్ల మంది భారతీయులు.. ప్రమాదకర వాయు కాలుష్యంలోనే జీవిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. వీరిలో 51 కోట్ల మంది ఉత్తర భారత్‌లో నివసిస్తున్నారన్న నివేదిక దాదాపు 40శాతం జనాభా వాయుకాలుష్యం కారణంగా 7.6 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోతున్నట్లు పేర్కొంది. గ‌డిచిన రెండు ద‌శాబ్దాల్లో భారత్‌లో పారిశ్రామికీక‌ర‌ణ విప‌రీతంగా పెరిగింద‌ని ఫలితంగా వాయు కాలుష్యం పెరిగిన‌ట్లు అంచ‌నా వేశారు.వాయుకాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా మనిషి జీవిత కాలం 2.2 ఏళ్లు తగ్గనున్నట్లు షికాగో యూనివర్సిటీ నివేదిక పేర్కొంది. వాయుకాలుష్యం ప్రభావం ధూమపానం, మద్యపానం, ఉగ్రవాదం కంటే ఎక్కువని అంచనావేసింది.