Movies

కొత్త జోడీ కుదిరింది

కొత్త జోడీ కుదిరింది

డీజే టిల్లు’ చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకున్నది బెంగళూరు భామ నేహా శెట్టి. ఈ చిత్రంలో రాధిక పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తీసుకొచ్చిన గుర్తింపుతో ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘రూల్స్‌ రంజన్‌’ అనే చిత్రంలో ఆమె నాయికగా ఎంపికైంది. ఈ విషయాన్ని బుధవారం చిత్రబృందం ప్రకటించారు. ఈ సినిమాను రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు దర్శకుడు రత్నం కృష్ణ. ఏఎం రత్నం సమర్పణలో స్టార్‌ లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దివ్యాంగ్‌ లవానియా, వి మురళీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ సినిమాలో అన్నూ కపూర్‌, సిద్ధార్థ్‌ సేన్‌ వంటి బాలీవుడ్‌ తారలతో పాటు ఆశిష్‌ విద్యార్థి, అజయ్‌ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.