DailyDose

అక్క స్ఫూర్తితో ఆర్మీలో చేరాలని..

Auto Draft

అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ స్టేషన్లో జరిగిన విధ్వంసకాండ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అందరూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఈ ఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ఘటనలో ఆందోళనకారులు రాళ్లు రువ్వగా.. ప్రతిగా పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. పోలీసుల కాల్పుల్లో ఒక యువకుడు చనిపోగా.. అతణ్ని వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దబీర్ పేటకు చెందిన రాకేశ్‌గా గుర్తించారు. ఆర్మీలో చేరాలనేది అతడి చిరకాల కోరిక._*

* రాకేశ్ తండ్రి కుమార స్వామి రైతు కాగా.. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. రాకేశ్ సోదరి సంగీత పశ్చిమ బెంగాల్‌లో బీఎస్ఎఫ్ జవాన్‌ గా పని చేస్తున్నారు. ఆమె స్ఫూర్తి, ప్రోత్సాహంతో తాను కూడా సైన్యంలో చేరాలని రాకేశ్ భావించాడు. అందుకోసమే తీవ్రంగా శ్రమించాడు. రాకేశ్ హెయిర్‌స్టయిల్ బట్టి.. అతడికి ఆర్మీలో చేరడం అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. మూడు రోజుల క్రితమే రాకేశ్ హైదరాబాద్ వచ్చాడని తెలుస్తోంది. సికింద్రాబాద్‌లో పోలీసుల కాల్పుల్లో రాకేశ్ మరణించాడని స్థానిక పోలీసులు అతడి కుటుంబీకులకు తెలిపారు. దీంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. రాకేష్ తల్లిదండ్రులను పోలీసులు సికింద్రాబాద్ తీసుకెళ్లారు. రాకేష్ మృతితో దబీర్ పేటలో తీవ్ర విషాదం అలుకుముంది. సికింద్రాబాద్‌లో జరిగిన కాల్పుల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచ గ్రామానికి చెందిన లక్కం వినయ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతడి ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ప్రస్తుతం అతడికి గాంధీ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.