DailyDose

ఇంటర్నెట్ స్వేచ్ఛలో భారత్ వెనుకంజ

ఇంటర్నెట్ స్వేచ్ఛలో భారత్ వెనుకంజ

ఆధునిక జీవన విధానంలో అంతర్జాలం విడదీయలేని భాగంగా మారిపోయింది. నిత్య జీవితంలో అంతర్భాగం అయిపోయింది. పసికందులు సైతం టచ్ స్క్రీన్‌తో ఆటలాడుతున్న కాలంలో ఇంటర్నెట్ లేని క్షణాన్ని ఊహించుకోవడమే కష్టం. అలాంటిది మన దేశంలో నిరసనలు, ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినపుడల్లా అంతర్జాల సేవలను రోజుల తరబడి నిలిపేస్తున్నారు. దీంతో అంతర్జాల స్వేచ్ఛలో మన దేశం చాలా వెనుకబడింది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై దాదాపు ఏడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో అధికారులు Internet Servicesను సస్పెండ్ చేస్తున్నారు. ఫలితంగా అన్ని రంగాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ గృహిణులు సైతం ఇంటర్నెట్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

డిజిటల్ హక్కుల కోసం గళమెత్తుతున్న సంస్థ యాక్సెస్ నౌ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018 నుంచి 2021 వరకు వరుసగా నాలుగేళ్ళపాటు మన దేశం ఇంటర్నెట్ స్వేచ్ఛలో వెనుకబడింది. 2021లో 106 సార్లు ఇంటర్నెట్ సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. దీంతో ప్రపంచంలో అంతర్జాల స్వేచ్ఛను సక్రమంగా కల్పించని అతి పెద్ద అపరాధిగా భారత్ నిలిచింది.

2020లో 29 దేశాల్లో 159 సార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్ జరిగింది, 34 దేశాల్లో 182 సార్లు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు. 2021లో భారత దేశం తర్వాతి స్థానంలో మయన్మార్, సూడాన్, ఇరాన్ నిలిచాయి. మయన్మార్‌లో 15సార్లు, సూడాన్‌లో ఐదుసార్లు, ఇరాన్‌లో ఐదుసార్లు అంతర్జాల సేవలకు అంతరాయం కలిగింది.
రాజకీయ పరిస్థితులపై ప్రభావం పడినపుడు…ముఖ్యంగా రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేసే ఎన్నికలు, నిరసనలు వంటివి జరిగేటపుడు ఇంటర్నెట్‌ను నిలిపేస్తున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. కోవిడ్-19 మహమ్మారి నుంచి ప్రపంచం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నప్పటికీ, 2021లో ఇంటర్నెట్ షట్‌డౌన్స్ నాటకీయంగా పెరిగాయి. 2021లో సుదీర్ఘ అంతరాయాలతోపాటు తాత్కాలిక అంతరాయాలు కూడా కనిపించాయి. ఈ అంతరాయాలకు చెప్తున్న కారణాలు మాత్రం ఒకే విధంగా ఉంటున్నాయి.