DailyDose

‘భారతీయ న్యాయ వ్యవస్థలో చట్టబద్ధ పాలనకే ప్రాధాన్యం’

Auto Draft

రాజ్యాంగసూత్రాలకు అనుగుణంగాలేని ఏ చట్టాన్నైనా కొట్టేసే శక్తి భారతీయ కోర్టులకుందన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ. భారతీయ న్యాయ వ్యవస్థలో చట్టబద్ధ పాలనకే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. జర్మనీలోని దోర్త్‌మండ్‌లో ‘ఆర్బిట్రేషన్‌ ఇన్‌ ఏ గ్లోబలైజ్డ్‌ వరల్డ్‌ – ది ఇండియన్‌ ఎక్స్‌పీరియన్స్‌’ అన్న అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

“భారతీయ న్యాయవ్యవస్థ చట్టబద్ధ పాలన(రూల్‌ ఆఫ్‌ లా)కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అందించిన హక్కులకు భద్రత కల్పిస్తోంది. భారతీయ న్యాయవ్యవస్థకున్న సంపూర్ణ స్వతంత్రత, అన్ని పక్షాలనూ సమానంగా చూసేలా రాజ్యాంగం ప్రసాదించిన బలాన్ని మీరు విశ్వసించవచ్చు. ప్రభుత్వం తీసుకొనే ప్రతి చర్యనూ సమీక్షించే అధికారం భారత్‌లోని హైకోర్టులు, సుప్రీంకోర్టుకు ఉంది. రాజ్యాంగసూత్రాలకు అనుగుణంగా లేని ఏ చట్టాన్నైనా అవి కొట్టేయగలవు. అలాగే కార్యనిర్వాహకవర్గ ఏకపక్ష నిర్ణయాలను కూడా పక్కనపెట్టగలవు” అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పేర్కొన్నారు. ఇండో-జర్మన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వార్షిక సమావేశం సందర్భంగా జర్మనీలోని దోర్త్‌మండ్‌లో ‘ఆర్బిట్రేషన్‌ ఇన్‌ ఏ గ్లోబలైజ్డ్‌ వరల్డ్‌ – ది ఇండియన్‌ ఎక్స్‌పీరియన్స్‌’ అన్న అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. “ప్రపంచంలో ఏమూల సంక్షోభం తలెత్తినా దాని ప్రకంపనలు అంతటా వ్యాపించి సరఫరా గొలుసును ప్రభావితం చేస్తుంటాయి. ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా అది మానవహక్కులను ప్రభావితం చేస్తుంది. ఏ వ్యక్తి, సమాజం, దేశం కూడా తాము దోపిడీకి గురయ్యామని భావించే పరిస్థితి రాకుండా భరోసా ఇవ్వాలి. తమ పెట్టుబడులకు రక్షణ కల్పించి వివాదాలను పరిష్కరించే బలమైన న్యాయవ్యవస్థ ఉంటే వ్యాపారులకు అదనపు ప్రోత్సాహం లభించినట్లే. అందువల్ల సుస్థిర శాంతిభద్రతలు, సమర్థ న్యాయవ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆతిథ్య దేశాలపైనే ఉంటుంది.

భారతీయ కోర్టులు వివక్ష చూపవు
అంతర్జాతీయ వివాద పరిష్కార ప్రక్రియను అన్ని పక్షాలూ పూర్తిగా విశ్వసించాలి. గత రెండు దశాబ్దాలుగా భారత్‌ మధ్యవర్తిత్వం, రాజీ, ఇతర ప్రత్యామ్నాయ పరిష్కార విధానాలను క్రియాశీలకంగా ప్రోత్సహిస్తోంది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని అనుసరించడం వల్ల పరిష్కార ప్రక్రియను ఎంచుకొనే స్వేచ్ఛ పార్టీలకు ఉంటుంది. మధ్యవర్తిత్వ ప్రక్రియలో స్థానిక న్యాయస్థానాల జోక్యం పెరిగిపోతోందన్న భావన ఇటీవలి కాలంలో పెరుగుతోంది. కానీ భారతీయ న్యాయస్థానాలు మధ్యవర్తిత్వ అనుకూల విధానాన్ని ఎంచుకున్నాయని మీకు భరోసా ఇస్తున్నా. భారతీయ న్యాయస్థానాలు రాజీ విధానం ద్వారా వివాదాన్ని పరిష్కరించే స్వేచ్ఛను ఆర్బిట్రల్‌ ట్రైబ్యునల్స్‌కే ఇచ్చాయి. సమస్య పరిష్కారానికి దేశ, విదేశీయులెవరైనా భారతీయ న్యాయవ్యవస్థను ఆశ్రయించే అధికారాన్ని రాజ్యాంగం కల్పిస్తోంది. దేశం ప్రాతిపదికన భారతీయ కోర్టులు వివక్ష చూపవు. వాణిజ్య వివాదాలను వేగంగా పరిష్కరించడానికి భారతీయ పార్లమెంటు వాణిజ్యకోర్టుల చట్టాన్ని తీసుకొచ్చింది. దీర్ఘకాల వాణిజ్య వివాదాలకు ముగింపు పలకడానికి భారత శాసన వ్యవస్థ చట్టాలను సవరిస్తోంది. పార్టీలు ఒప్పందం కుదుర్చుకోకముందే దాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన అధికార యంత్రాంగం చూసి ఆమోదముద్ర వేయడం మేలని గతంలో సూచించాను.వివాదాల పరిష్కారాలకు అవసరమైన మౌలికవసతులు కల్పించాల్సిన బాధ్యత అభివృద్ధి చెందిన దేశాలపై ఉంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మధ్యవర్తిత్వ వ్యవస్థను చూస్తే అది పూర్తిగా సింగపూర్‌, లండన్‌, పారిస్‌, స్టాక్‌హోమ్‌లకే పరిమితమైంది. అభివృద్ధి చెందుతున్న దేశాలనుంచే అత్యధిక వివాదాలు తలెత్తుతున్నప్పటికీ ఈ కేంద్రాలు అభివృద్ధి చెందిన దేశాల్లో నెలకొన్నాయి. అత్యాధునిక సంస్థాగత మధ్యవర్తిత్వ వ్యవస్థను ఏర్పాటుచేయడం ద్వారా ఈ అసమతౌల్యాన్ని సరిదిద్దాలి. నా చొరవతో హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటైంది. ఇండో-జర్మన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, జర్మన్‌ ప్రభుత్వాలు భారత్‌లోని ఇలాంటి కేంద్రాలను ప్రోత్సహించాలి. వ్యవస్థాగత ఆర్బిట్రేషన్‌ సెంటర్లన్నీ ఒక మండలిగా ఏర్పడితే అత్యుత్తమ పద్ధతులను తెలుసుకొని అనుసరించడానికి వీలవుతుంది. ఏ విషయమైనా తెలుసుకోవడంతోనే సరిపోదు. దాన్ని ఆచరణలో పెట్టాలి. అలాగే చేయాలన్న సంకల్పం ఒక్కటే చాలదు, ప్రయత్నమూ చేయాలి అన్న జర్మన్‌ రచయిత గొయితె వ్యాఖ్యలను అందరూ దృష్టిలో పెట్టుకోవాలి’’ అని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పిలుపునిచ్చారు.