Politics

ఎవరీ ద్రౌపది ముర్ము? రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఆమెనే ఎందుకు?

ఎవరీ ద్రౌపది ముర్ము? రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఆమెనే ఎందుకు?

బీజేపీ రాష్ట్రపతి అత్యున్నత పదవికి ద్రౌపది ముర్ముని ప్రతిపాదించడానికి ముందు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ని సంప్రదించి మరీ ఆమె పేరును ఖరారు చేసింది. అంతేకాదు రాబోయే రాష్ట్రపతి ఎన్నికలలో బీజేడీ ఆమెకు మద్దతు ఇవ్వనుందని సమాచారం. ఈ మేరకు మోదీ ప్రభుత్వం ఆమె పేరునే ఎందుకు? ప్రస్తావించింది. ఆమెకే ఈ అత్యున్నత పదవిని ఎందుకు? పట్టం గట్టాలనుకుంటోంది వంటి రకరకాల ప్రశ్నలు అందరి మదిలోనే తలెత్తే ప్రశ్నలే…

ఇంతకీ ఆమె ఎవరంటే…
ఐతే గతంలో బీజేపి 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో దళితవ్యక్తిని రాష్ట్రపతిగా చేసి అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. మళ్లీ ఇప్పుడూ అందరీ అంచనాలను తారుమారు చేస్తూ… మోదీ చెబుతూ ఉండే సబ్‌కా సాథ్‌ సబ్‌ కా బిస్వాస్‌ నినాదానికి అద్దం పట్టేలా ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి పదవికి నామినేట్‌ చేశారు. ఈ మేరకు ద్రౌపది ముర్ము జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్ంత్‌ సిన్హా పై పోటీ చేయనున్నారు. ద్రౌపది ముర్ము ఒక సాధారణ గిరిజన మహిళ. ఆమె 1997లోఒడిశాలోని రాయరంగ్‌పూర్‌ నగర్‌ పంచాయితీలో కౌన్సిలర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది.

ఆ తర్వాత ఆమె 2000లో బీజేపీ-బీజేడీ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2015 లో జార్ఖంఖ్‌ గవర్నర్‌గా అత్యున్నత పదవిని అలంకరించారు. అంతేకాదు ఒడిశా ప్రభుత్వంలో రవాణా, వాణిజ్యం, మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన ఆమెకు విభిన్న పరిపాలనా అనుభవం ఉంది. ఈ మేరకు ద్రౌపరి ముర్ము మాట్లాడుతూ…ఎన్డీఏ తరుఫున రాష్ట్రపతి పదవికి నామినేట్‌ అయ్యానని తెలుసుకుని చాలా ఆనందించానన్నారు. తొలుత తాను చాలా ఆశ్చర్యపోయానని చెప్పారు. ఒక గిరిజన మహిళగా రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదన్నారు.

ఒడిశా శాసనసభ్యులు, ఎంపీలు తనకు మద్దతిస్తారని విశ్వాసిస్తున్నాని చెప్పారు. అంతేకాదు తాను ఒక గిరిజన పుత్రికగా, ఒడియాగా నాకు మద్దతు ఇవ్వండని సభ్యులందరిని అభ్యర్థించే హక్కు కూడా ఉందని నొక్కి చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనుందన్న వార్త తెలియగానే ఒడిశాలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ముఖ్యంగా ఆమె నివశించే మయుర్‌భంజ్‌ జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైతే గనుక గిరిజన మహిళగా ఎన్నికైన తొలి రాష్ట్రపతిగా ఖ్యాతీ గాంచుతుంది.