NRI-NRT

తెలుగు కేవలం భాష కాదు.. జీవన విధానం, నాగరికత

తెలుగు కేవలం భాష కాదు.. జీవన విధానం, నాగరికత

తెలుగు అనేది కేవలం భాష కాదు.. జీవన విధానం, నాగరికత అని జస్టిస్‌ ఎన్వీ రమణ (NV Ramana) అన్నారు. మాతృభాషను, మాతృమూర్తిని పూజించడం ఒక ప్రత్యేకత అని చెప్పారు. అమ్మ భాషలోని తియ్యదనం అనుభవించాల్సిందే.. మాటాల్లోనే చెప్పలేమన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన మీట్‌ అంట్‌ గ్రీట్‌ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాతృభాష, మాతృభూమిలో ఉన్న ప్రేమను ఆస్వాదించాలని వెల్లడించారు. మన భాషతో పాటు పరాయి భాషనూ గౌరవిస్తున్నామని తెలిపారు. ఇంట్లో పెద్దలు పిల్లలతో తెలుగులో మాట్లాడాలని కోరారు. మాతృభాషలోనే చదివి నేను ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు.

మా తెలుగు తల్లికి మల్లెపూల దండతో కార్యక్రమం ప్రారంభమైందని సీజేఐ అన్నారు. తెలుగుతల్లి ముద్దు బిడ్డలుగా ఉన్న మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్నో దశల్లో అనేక పరీక్షలు ఎదుర్కొని ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. మాతృభూమిని, సొంత మనుషులను వదులుకుని ఇక్కడ ఉంటున్నారని తెలిపారు. తెలుగు ప్రజల్లో నేను ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నానని చెప్పారు. పుట్టిన ఊరు, మట్టివాసన, మట్టి గుబాళింపును నెమరువేసుకోవాలని ఎన్‌ఆర్‌ఐలకు సూచించారు. తెలుగు సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

అమెరికాలో దాదాపు 7 లక్షల మంది తెలుగువారు ఉన్నారని చెప్పారు. ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. మీ నిబద్ధత చూస్తుంటే తెలుగుజాతి భవిష్యత్తు సురక్షితమని విశ్విస్తున్నాని అన్నారు. అమెరికాలో తెలుగువారు సంపద సృష్టిస్తున్నారని చెప్తుండటం గర్వకారణమన్నారు.ప్రపంచంలో అనేక దేశాలు, ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డారని వెల్లడించారు.

రైతు కుటుంబం నుంచి వచ్చా..
రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను సీజేఐ స్థాయికి ఎదిగానని జస్టిస్‌ ఎన్వీ రమణ చెప్పారు. తెలుగువాడిగా సీజేఐ అవకాశం రావడం చాలా సంతోషాన్నిచ్చిం దని చెప్పారు. న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకోవడం చాలా కష్టమన్నారు. పట్టుదలతో పాటు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉన్నందునే ఈ స్థాయికి చేరుకున్నానని వెల్లడించారు. రాష్ట్రపతిని లేదా చిన్న ఉద్యోగిని కలిసినా తన ప్రవర్తనలో మార్పు ఉందని చెప్పారు.

అది అపోహ మాత్రమే
మాతృభాషలో చదివితే ఉద్యోగాలు రావనేది అపోహ మాత్రమేనని జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. తాను లా మాత్రమే ఇంగ్లిష్‌ మీడియంలో చదివానని చెప్పారు. మాతృభాషలో చదివి తాను ఈ స్థాయికి వచ్చానని మరచిపోవద్దని సూచించారు. మన భాష, సంస్కృతి మరచిపోతే జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. తెలుగు భాష కోసం ఉద్యమం చేయాల్సిన దుస్థితి ఏర్పడటం బాధగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. జాషువా, దాశథి, శ్రీశ్రీ వంటి మహానుభావులు వెలకట్టలేని సంపద ఇచ్చారని చెప్పారు.

ప్రజా సంక్షేమమే పరమావధిగా సత్వర న్యాయం
ప్రజా సంక్షేమమే పరమావధిగా సత్వర న్యాయం అందాలని ఆకాంక్షించారు. న్యాయ సమీక్ష చేసే అధికారం భారతదేశ న్యాయవ్యవస్థకు ఉందని చెప్పారు. ఎవరైనా జడ్జి పదవి చేపట్టాక న్యాయాన్ని నిలబెట్టేలా ప్రవర్తిస్తారని తెలిపారు. ప్రజల్లో చైతన్యం, విద్యాజ్ఞానం పెరిగిందన్నారు. రాజకీయ అభిప్రాయాలతో సంబంధం లేకుండా జడ్జిలు పనిచేస్తారని తెలిపారు. న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీప్రక్రియ వేగంగా పూర్తిచేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టులో తన హయాంలో తొమ్మిది మంది జడ్జిలను నియమించామని గుర్తుచేశారు