బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం విచారించింది. మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేశ్ చంద్రశేఖర్ కేసులో నటిని విచారించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేసు వ్యవహారంలో ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో జాక్వెలిన్ ఈడీ ఎదుట హాజరయ్యారు. పీఎంఎల్ఏ కింద నమోదైన కేసులో నటికి చెందిన రూ.7.27కోట్ల ఆస్తులను ఈడీ ఏప్రిల్లో జప్తు చేయగా.. రెండు నెలల అనంతరం మరోసారి విచారించింది.ఇప్పటికే రెండుసార్లు కేసులు జాక్వెలిన్ను ఈడీ విచారించింది. ఈ కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న పలువురిపై ఈడీ ఆరా తీస్తున్నది. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రశేఖర్ నేతృత్వంలో అక్రమార్కులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టి ఉండవచ్చని ఈడీ అనుమానిస్తున్నది. సుకేశ్ చంద్రశేఖర్పై ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసును విచారిస్తున్నది.రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్లకు బెయిల్ ఇప్పిస్తామని నమ్మించి.. వారి భార్యల నుంచి ఏకంగా రూ. 200 కోట్లు సుకేశ్ చంద్రశేఖర్ వసూలు చేశాడు. ఆ తర్వాత బెయిల్ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఫిర్యాదుకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాదిలో ఢిల్లీ పోలీసులు సుకేశ్ను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని సుకేశ్ ఈ మోసానికి పాల్పడినట్లు ఈడీ పేర్కొంది.