రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రతిపాదించిన ద్రౌపది ముర్మును కించపరిచే విధంగా ట్వీట్లు చేసిన సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మపై లఖ్నవూలో ఆదివారం కేసు నమోదైంది. ఈ మేరకు లఖ్నవూ పోలీసు కమిషనర్ డీకే ఠాకూర్ సోమవారం ఓ ప్రకటన చేశారు. ‘ఒకవేళ ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు ? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు ?’’ అని పేర్కొంటూ జూన్ 22న వర్మ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ఈ ట్వీట్పై దుమారం రేగగా ఎవరిని కించపరచడం తన ఉద్దేశం కాదని పేర్కొంటూ 24వ తేదీన వర్మ ట్విటర్ ద్వారా స్పష్టత ఇచ్చారు. కానీ, 25వ తేదీన వర్మ ఈ అంశంపై వరుస ట్వీట్లు చేశారు. ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు, కౌరవులు యుద్ధాన్ని మరిచి ఆమెను పూజిస్తారని, మహాభారతం తిరిగి రాయబడుతుందని, ప్రపంచమంతా భారత్ను చూసి గర్విస్తుందని, జై బీజేపీ అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. అంతేకాక, గౌరవనీయులైన ద్రౌపది ముర్ము గురించి తెలుసుకున్నానని, ఆమె ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రపతి అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదని, థ్యాంక్యూ బీజేపీ అని పేర్కొంటూ మరో ట్వీట్ చేశారు.