Business

అంబానీ సంచలన నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా

అంబానీ సంచలన నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ జియో పగ్గాలను తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి అప్పగించారు. ఇకపై ఆకాశ్ అంబానీ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్​కు ఛైర్మన్​గా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ముకేశ్.. జూన్ 27న రాజీనామా చేశారని సంస్థ స్టాక్​మార్కెట్లకు ఇచ్చిన ఫైలింగ్స్​లో వెల్లడించింది. అదేరోజు జరిగిన సమావేశంలో ఆకాశ్ నియామకానికి బోర్డు ఆమోదముద్ర వేసిందని తెలిపింది. ఆకాశ్​.. ఇప్పటివరకు రిలయన్స్​ జియోలో నాన్​-ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​గా ఉన్నారు. 2014లో జియో బోర్డులో చేరారు.అదేసమయంలో, జియో మేనేజింగ్ డైరెక్టర్​గా పంకజ్ మోహన్ పవార్​ను నియమిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. జూన్ 27నే ఆయన ఈ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపింది. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారని వివరించింది. మరోవైపు, రమీందర్ సింగ్ గుజ్రాల్, కేవీ చౌదరిలను స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించినట్లు స్పష్టం చేసింది. అయితే జియో ప్లాట్‌ఫామ్‌ లిమిటెడ్‌కు ముకేశ్‌ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. ముకేశ్‌ అంబానీ తన వ్యాపార బాధ్యతలను వారసులకు అప్పగించే ప్రణాళికలో భాగంగానే ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది.