పత్తి సాగులో ఆధునిక పద్దతులు, అధిక సాంధ్రత పత్తి సాగుపై అధ్యయనంలో భాగంగా అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం మెంఫిస్ నగరంలో 13 వేల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు రిచర్డ్ కెల్లీ, బ్రాడ్ విలియమ్స్తో నిరంజన్ రెడ్డి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. మంత్రి నిరంజన్ రెడ్డి వెంట ఎమ్మెల్యేలు రవీంద్ర నాయక్, డాక్టర్ మెతుకు ఆనంద్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సీడ్స్ ఎండీ కేశవులు ఉన్నారు.ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉత్పాదకత పెంచే పత్తి వంగడాలు రావాలన్నారు. భారతీయ కమతాలకు తగిన యంత్రాలు రావాలి. ఈ దిశగా వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు వేగవంతం చేయాలని సూచించారు. అమెరికా వ్యవసాయ కమతాలు అతి పెద్దవి.. దీంతో పోల్చుకుంటే భారతీయ కమతాలు ఎంతో చిన్నవని తెలిపారు. చిన్న కమతాలకు సరిపోయేవిధంగా యాంత్రీకరణ జరిగితే రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.
అంతర్జాతీయ పోటీని తట్టుకోవాలంటే పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు పంట ఉత్పాదకతను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. రోజుకు 52 నుండి 70 హెక్టార్లలో ఒకేసారి పత్తిని తీసే (సింగిల్ టైమ్ హార్వెస్టర్) ధర 1 మిలియన్ యూఎస్ డాలర్లు ఉన్నదని చెప్పారు. గత 200 ఏండ్ల నుంచి అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలో పత్తి ప్రధాన పంటగా ఉందన్నారు. కాలక్రమంలో పత్తి సాగులో విప్లవాత్మక మార్పులు సృష్టించారని పేర్కొన్నారు. టెన్నెన్సీ రాష్ట్రంలో ఏటా 5.5 లక్షల ఎకరాల నుండి 6.5 లక్షల ఎకరాలలో పత్తి సాగు జరుగుతుందన్నారు. ఏటా మిలియన్ బేళ్ల వరకూ ఉత్పత్తి అవుతుందన్నారు. నేషనల్ కాటన్ కౌన్సిల్ ఆఫ్ అమెరికాకు ఇది ప్రధాన కార్యలయంగా పనిచేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.