Politics

పవన్ ‘నవ సందేహాలు’

పవన్ ‘నవ సందేహాలు’

వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పలు సందేహాలు లేవనెత్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ‘నవ సందేహాలు’ పేరుతో ఆయన ఓ ట్వీట్‌ చేశారు.ఈ ట్వీట్‌లో రైతుభరోసా, అమ్మఒడి, పెన్షన్లు, సంపూర్ణ మద్యపాన నిషేధం, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పేదలందరికీ ఇళ్లు, ఆసరా పథకాలపై తన ప్రశ్నలను పవన్‌ సంధించారు.పవన్‌ లేవనెత్తిన సందేహాలు.

మొదటి రత్నం – రైతు భరోసా
64 లక్షల మందికి మేలు అని చెప్పి.. 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా?మూడేళ్లలో 3 వేలమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకొంటే కేవలం 700మందికే ఆర్థిక సాయాన్ని పరిమితం చేయలేదా?

రెండో రత్నం – అమ్మఒడి
అమ్మఒడి 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి.. 83 లక్షల మందికి ఇచ్చామని ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు?

మూడో రత్నం – పెన్షన్లు
పెన్షనర్ల జాబితాను కుదించి 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా?

నాలుగో రత్నం – సంపూర్ణ మద్యపాన నిషేధం
మద్యం ఆదాయం 2018-19లో రూ.14 వేల కోట్లు.. 2021-22లో రూ.22 వేల కోట్లు.. ఇదేనా మద్యనిషేధం? ఈ ఆదాయం చూపించే రూ.8 వేల కోట్లు బాండ్లు అమ్మలేదా?

ఐదో రత్నం – జలయజ్ఞం
పోలవరం ప్రాజెక్టును ‘యుద్ధ ప్రాతిపదిక’న ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా?

ఆరో రత్నం – ఆరోగ్యశ్రీ
ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆసుపత్రులు ఎందుకు పక్కకు తప్పుకొంటున్నాయి? సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదు?

ఏడో రత్నం – ఫీజు రీయింబర్స్ మెంట్
పీజీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారు? రీయింబర్స్ మెంట్ చేయకపోవడం వల్లే విద్యార్థులకు హాల్ టికెట్లు ఆపేస్తున్న మాట నిజం కాదా?

ఎనిమిదో రత్నం – పేదలందరికీ ఇళ్లు
చెరువుల్లో, గుట్టల్లో స్థలాలు ఇచ్చిన మాట నిజమే కదా? ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ఎందుకు నిధులు మంజూరు చేయలేదు?

తొమ్మిదో రత్నం – ఆసరా
పొదుపు సంఘాల సంఖ్యను ఏటేటా లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారు? అభయ హస్తం నిధులు రూ.2 వేల కోట్లు ఎటుపోయాయి?