*జాబితా వెల్లడించిన టైమ్ మ్యాగజీన్
టైమ్ మ్యాగజీన్ తాజాగా వెల్లడించిన ప్రపంచంలోని 50 గొప్ప ప్రదేశాల జాబితాలో అహ్మదాబాద్ నగరం, కేరళ రాష్ట్రం చోటు సంపాదించాయి. ‘జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు.. పర్యాటకం, కొత్త మానవ సంబంధాల ద్వారా ఉత్సాహం లభిస్తుంది. 2022లో అన్వేషించాల్సిన అసాధారణ గమ్యస్థానాలు ఇవే’నంటూ ఈ ప్రదేశాల గురించి టైమ్ వివరించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు పొందిన అహ్మదాబాద్ను ప్రముఖంగా ప్రస్తావించింది. సబర్మతి నదీతీరాన ఉన్న గాంధీ ఆశ్రమం, నవరాత్రి ఉత్సవాలు, సైన్స్ సిటీ, రోబోటిక్ గ్యాలరీతో పాటు… యోగా సాధనకు ఇక్కడున్న సదుపాయాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. కేరళను భారత్లోని అత్యంత అందమైన రాష్ట్రంగా అభివర్ణించిన టైమ్స్… ఇది దేవభూమి అని, ఇక్కడ అద్భుతమైన బీచ్లు, వెనుక జలాలు, దేవాలయాలు, రాజభవనాలు, హౌస్బోట్లు, పచ్చని ప్రకృతి లోగిళ్లు ఉన్నాయని పేర్కొంది. టైమ్ జాబితాలో యూఏఈలోని రస్ అల్ ఖైమా, ఉటాలోని పార్క్సిటీ, ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్, జాంబియాలోని లోయర్ జంబేజి నేషనల్ పార్క్ తదితర ప్రదేశాలతో పాటు… అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూడా చోటు దక్కించుకోవడం విశేషం.