Movies

పొరపాటున కూడా మొహానికి సబ్బు వాడను.. నా బ్యూటీ సీక్రెట్‌ అదే!

పొరపాటున కూడా మొహానికి సబ్బు వాడను.. నా బ్యూటీ సీక్రెట్‌ అదే!

బాలీవుడ్‌ తెరపై వెలిగిన మంగళూరు అందం శిల్పాశెట్టి. తన సౌందర్యంతో యువతను కట్టిపడేసి 90వ దశకంలో ఆరాధ్య హీరోయిన్‌గా మారింది. నటిగా, నిర్మాతగా, డాన్సర్‌గా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. అదే విధంగా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాజస్తాన్‌ రాయల్స్‌ యజమానిగా మారి వ్యాపారవేత్తగానూ రాణించింది. ఇక ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే 47 ఏళ్ల శిల్పాశెట్టి తరచుగా వీడియోలు షేర్‌ చేస్తుందన్న సంగతి తెలిసిందే.ఇక తన సౌందర్య రహస్యమేమిటో కూడా అభిమానులతో పంచుకుంది ఈ కర్ణాటక బ్యూటి. ‘‘కంటి నిండా నిద్ర.. నా ఫరెవర్‌ బ్యూటీ సీక్రెట్‌. పొరపాటున కూడా మొహానికి సబ్బు వాడను. అది మొహం మీది మృదువైన చర్మాన్ని పొడిబారుస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో ఆలివ్‌ ఆయిల్‌ లేదంటే జాన్సన్‌ బేబీ ఆయిల్‌ కలిపి మొహానికి రాసి.. కాటన్‌ ఉండతో తుడిచేస్తాను.దీనివల్ల మొహానికి సున్నితంగా మసాజ్‌ చేసినట్టయ్యి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అలసట తీరి హాయిగా నిద్రపడుతుంది. తెల్లవారి మొహం కాంతులీనుతూ ఉంటుంది. ఈ కిటుకులన్నీ మా అమ్మ చెప్పినవే. వయసులో ఉన్నప్పుడు మొహానికి ఎన్ని కాస్మెటిక్స్‌ రాస్తే అంత త్వరగా వృద్ధాప్యం వస్తుందని ఆమె మాట.అమ్మ మాటను తు.చ తప్పకుండా పాటిస్తా!’’ అని ఆమె శిల్పాశెట్టి పేర్కొంది. కాగా డిజిటల్‌ ఎంట్రీకి రెడీ అయిన శిల్పాశెట్టి.. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇక రాజ్‌కుంద్రాను వివాహమాడిన శిల్పకు వియాన్‌ అనే కుమారుడు జన్మించగా.. సరోగసీ ద్వారా కూతురు సమిషాకు వీరు జన్మనిచ్చారు.