NRI-NRT

స్వదేశాన్ని వీడుతున్న భారతీయ సంపన్నులు..!

Auto Draft

గతేడాది 1.6 లక్షల పైచిలుకు మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి తాజాగా ప్రకటించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు రెండింతలు. దీంతో.. భారతీయులు దేశాన్ని ఎందుకు వీడుతున్నారన్న ప్రశ్న మరోసారి చర్చకు వస్తోంది. ఇలా పరాయి దేశాల్లో సెటిలవుతున్న వారిలో సంపన్నులు వాటా అధికం. అయితే.. ఉన్నత మధ్యతరగతి వారు కూడా అధికాదాయ దేశాల్లో సెటిలయ్యేందుకు ఉత్సుకతతో ఉన్నారు. ఆర్గనేజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ నివేదిక ప్రకారం..ఉన్నతచదువులు చదువుకున్న భారతీయులే అత్యధికంగా దేశాన్ని వీడుతున్నారు. ఇటువంటి వలసలు ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్‌ తొలి స్థానంలో ఉంది. 2020 నాటి నివేదిక ప్రకారం.. ఉన్నతచదువులు చదివి, విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 3 మిలియన్లకు పైనే!

ఈ మేథోవలస, సంపద తరలిపోవడానికి భారత్‌లోని పరిస్థితులే కారణమని ఆర్థిక రంగ నిపుణుల అభిప్రాయంగా ఉంది. ఇక్కడ విద్యావ్యవస్థ..నిపుణులను వెలికితీస్తున్నప్పటికీ.. వారికి సంతృప్తికరమైన ఉద్యోగవ్యాపారావకాశాలు కల్పించడంలో ఆర్థిక వ్యవస్థ విఫలమవుతోంది. భారత్‌లో అనేక రంగాలపై ప్రభుత్వ పట్టు కొనసాగుతుండటమే దీని కారణమని నిపుణులు చెబుతున్నారు. విదేశాల్లోని భారతీయులు ఉద్యోగ, వ్యక్తిగత జీవితాల మధ్య సమతౌల్యం సాధించగలుగుతున్నారని ప్రవాసీయుల సోషల్ నెట్‌వర్కింగ్ సంఘం ఇంటర్ నేషన్స్ ఇటీవల అభిప్రాయపడింది. ఇక భారత్‌లో కాలేజీ విద్య చదివిన ప్రతి ఐదుగురిలో ఒకరికి ఉద్యోగం లేదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ రూపొందించిన నివేదిక-2021లో వెల్లడైంది. ఇక ఇతర దేశాల్లో సరళతరమైన పన్ను విధానాలు, వ్యాపారావకాశాలు, ఆయా దేశాల పాస్‌పోర్టులకు ఉన్న గుర్తింపు తదితర కారణాల రీత్యా భారతీయ అపరకుబేరులు విదేశాలకు తరలిపోతున్నారు.