తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి పెళ్లి ఫోటోలు విడుదల చేసినందుకు గాను రూ.25 కోట్లు చెల్లించాలంటూ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ హీరోయిన్ నయనతార-దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులకు నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. జూన్ 9న వీరి వివాహం చెన్నై నగర శివారు ప్రాంతంలోని ఒక నక్షత్ర లగ్జరీ హోటల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ జరగ్గా, అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమాన్ని నయనతార, విఘ్నేష్ నెట్ఫ్లిక్స్కు విక్రయించారు. పెళ్ళితంతు, వివాహ ఏర్పాట్లు, పెళ్ళిపందిరి నిర్మాణం, వధూవరులు నడిచి వచ్చిన స్టేజీ అలంకరణ, వివాహానికి వచ్చిన ప్రముఖులకు ఏర్పాట్లు, ఇతర ఆతిథ్యం, ఒక్కొక్కరికీ రూ.3500 ఖర్చుతో భోజన ఏర్పాట్లు, ఇలా అన్ని ఖర్చులను నెట్ఫ్లిక్స్ భరించినట్టు సమాచారం. అందుకే వివాహం ముగిసిన తర్వాత ఒకటి రెండు ఫొటోలను మాత్రమే విడుదల చేశారు. ఈ వివాహం జరిగిన ఒక నెల రోజుల తర్వాత వివాహానికి వచ్చిన సినీ ప్రముఖుల ఫోటోలను నయనతార దంపతులు రిలీజ్ చేశారు. దీనిపై నెట్ఫ్లిక్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, పెళ్ళి కోసం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి, ఫోటోలను విడుదల చేశారని, అందువల్ల పెళ్ళికి ఖర్చు చేసిన రూ.25 కోట్లను తిరిగి చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు కోలీవుడ్లో విస్త్రత ప్రచారం జరుగుతోంది.