ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ పీటీ ఉష.. ఇవాళ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. హిందీ భాషలో ఆమె ప్రమాణం చేయడం విశేషం. లెజండరీ అథ్లెట్ పీటీ ఉషతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, ఫిల్మ్ రైటర్ వీ విజయేంద్ర ప్రసాద్, ఆధ్యాత్మిక నేత వీరేంద్ర హెగ్డేలను రాజ్యసభకు కేంద్రం నామినేట్ చేసిన విషయం తెలిసిందే. 1964, జూన్ 27వ తేదీన పీటీ ఉష జన్మించారు. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఆమె పుట్టారు. పయ్యోలీ ఎక్స్ప్రెస్ అన్న నిక్నేమ్ ఆమెకు ఉంది. క్వీన్ ఆఫ్ ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అని కూడా ఆమెను పిలుస్తారు. జాతీయ స్థాయిలో ఆమె అనేక పతకాలను గెలిచింది. 1982 ఏషియన్ గేమ్స్లో 100, 200 మీటర్ల ఈవెంట్లో ఆమె సిల్వర్ మెడల్స్ గెలిచింది. 1983లో కువైట్లో జరిగిన ఏషియన్ చాంపియన్షిప్లో 400 మీటర్ల ఈవెంట్లో గోల్డ్ గెలిచింది. 1984 ఒలింపిక్స్లో ఆమె 400మీటర్ల హార్డిల్స్లో నాలుగవ స్థానంలో నిలిచింది.