నాయికలు సాధ్యమైనంత స్లిమ్గా అందంగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. భోజన ప్రియులైన తారలకు ఇలా ఉండటం ఓ యజ్ఞం లాంటిదే. కళ్ల ముందే రుచికరమైన ఆహారాలు కనిపిస్తున్నా, కొనగలిగి, తినగలిగే శక్తి ఉన్నా చూస్తూ ఉండిపోవాల్సిందే. తింటే లావైపోయి, అవకాశాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ సందర్భాన్ని ప్రతి రోజూ ఎదుర్కొంటానని చెబుతున్నది అందాల తార దివ్యాంశ కౌషిక్. ఈ ఉత్తరాఖండ్ నాయిక ‘టక్కర్’ అనే తమిళ మూవీతో తెరంగేట్రం చేసింది.
ఆ తర్వాత ‘మజిలీ’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టింది. వెబ్ మూవీ ‘ద వైఫ్’ మంచి పేరు తీసుకురాగా..ఇప్పుడు రవితేజ సరసన ‘రామారావు ఆన్ డ్యూటీ’లో కనిపించబోతున్నది. తన కెరీర్కు కీలకమైన ఈ సినిమా ఫలితం మీద దివ్యాంశ చాలా ఆశలు పెట్టుకుంది. తనో ఫుడ్ లవర్ అని చెప్పుకునే ఈ భామ…ఆహారం తినకుండా కాపాడుకోవడమే తను చేస్తున్న పెద్ద సాధనగా చెప్పుకుంది. ఆమె మాట్లాడుతూ…‘ముస్సోరిలో చదువుకునేప్పుడు నచ్చిన ఆహారం తినేదాన్ని. అప్పుడు 20 కిలోలు పెరిగాను. తోటి విద్యార్థులు కామెంట్ చేసేవారు. సినిమాల్లోకి వద్దామని ఆలోచనలో ఉన్నప్పుడు నా బరువు పెద్ద ఆటంకం అయ్యింది. యష్ రాజ్ సంస్థలో శిక్షణ తీసుకుని బరువు తగ్గాను. ఢిల్లీలో ఫుడ్ చాలా బాగుంటుంది. హైదరాబాద్ వస్తే ముందు నేను ఆర్డర్ చేసేది బిర్యానీ. అయితే ఎంత తినాలో తప్పకుండా నియంత్రించుకుంటా’ అని చెప్పింది.