NRI-NRT

బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టిన అదానీ

బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టిన అదానీ

అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానాన్ని అధిరోహించారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ను ఆయన గురువారం వెనక్కి నెట్టారు. ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ కుబేరుల జాబితా ప్రకారం.. అదానీ సంపద 116.30 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.9,30,000 కోట్లు) కాగా.. గేట్స్‌ సంపద విలువ 104.6 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.8,36,800 కోట్లు). గత 24 గంటల వ్యవధిలో అదానీ సంపద 337 మిలియన్‌ డాలర్ల మేర పెరిగింది.

* గత రెండేళ్లలో అదానీ గ్రూప్‌నకు చెందిన కొన్ని లిస్టెడ్‌ కంపెనీల షేర్ల విలువలు 600 శాతానికి పైగా పెరిగాయని.. దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 25 శాతం వాటా కలిగిన 7 విమానాశ్రయాలు గత 3 ఏళ్లలోనే అదానీ పరం అయ్యాయని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. అంబుజా సిమెంట్స్‌, ఏసీసీలో హోల్సిమ్‌ గ్రూప్‌ వాటాను 10.5 బి.డా.కు గత మే నెలలో కొనుగోలు చేయడం ద్వారా, ఒక్కసారిగా దేశీయ సిమెంటు తయారీలో రెండోస్థానానికి అదానీ గ్రూప్‌ చేరింది. ఇజ్రాయెల్‌లో అతిపెద్ద నౌకాశ్రయమైన హైఫాను గత వారంలో 1.18 బి.డా.కు కొనుగోలు చేశారు.
210722bu-8b
టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆయన నికర సంపద విలువ 235.80 బిలియన్‌ డాలర్లు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ 90 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7,20,000 కోట్లు) సంపదతో ఈ జాబితాలో 10వ స్థానం పొందారు. ఫోర్బ్స్‌ అత్యంత శ్రీమంతుల జాబితాల్లో తొలి 10 స్థానాల్లో భారత్‌ నుంచి అదానీ, ముకేశ్‌లకే చోటు లభించింది.