03: 00PM
రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీ ఓట్ల లెక్కింపు ముగిసింది. కాసేపట్లో ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించనున్నారు. ద్రౌపది ముర్ముకు 62 శాతానికి పైగా ఓట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.
02: 50PM
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 540 ఎంపీ ఓట్లు రాగా.. సిన్హాకు 208 ఎంపీ ఓట్లు పడ్డాయి. ఓటు విలువ ముర్ముకు 3,78,00 ఉండగా , యశ్వంత్ సిన్హాకు 1,45,600 గా ఉంది. చెల్లని ఎంపీ ఓట్లు 15గా తేలాయి.
మొత్తం 4809 ఓటర్లలో 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సోమవారం జరిగిన ఎన్నికలో దాదాపు 99 శాతం మంది ఓటేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీపడిన విషయం తెలిసిందే. కాగా ముర్ముకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
1:50PM
కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు
11:00AM
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
పార్లమెంట్ భవనంలో మొదలైన కౌంటింగ్
రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు
దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరవుతారో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్లమెంట్ హౌస్లోని 63వ నంబర్ గదిలో గురువారం ఉదయం 11 గంటలకు లెక్కింపు ప్రారంభం అయ్యింది. అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను పార్లమెంట్ హౌస్లో లెక్కిస్తున్నారు.
ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యశ్వంత్ సిన్హా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ముర్ము విజయం సాధించడం లాంఛనమేనని రాజకీయ పండితులు తేల్చిచెబుతున్నారు.