Movies

కాంబో సెట్టయిందా?

కాంబో సెట్టయిందా?

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ దాకా తన అందాలతో సెగలు పుట్టిస్తోంది రష్మిక మందన్న. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో అవకాశాలు కొల్లగొడుతూ కథానాయికగా మంచి జోరుమీదున్నారామె. ఆమె నటించిన ‘మిషన్‌ మజ్ను’, ‘గుడ్‌బై’ హిందీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రాధాన్య పాత్రలో నటించిన ‘సీతారామం’ కూడా త్వరలోనే విడుదలవుతోంది. ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న విజయ్‌ ‘వారసుడు’, అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. హిందీలో సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్‌ సరసన ‘యానిమల్‌’ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా రష్మిక మరో తమిళ క్రేజీ ప్రాజెక్ట్‌ అంగీకరించారని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. చియాన్‌ విక్రమ్‌ హీరోగా పా రంజిత్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకె క్కుతోంది. జ్ఞానవేల్‌ రాజా నిర్మాత. ఇటీవలె పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్‌ పాత్ర కోసం చిత్ర యూనిట్‌ రష్మిక మందన్నను సంప్రదించిందట. విక్రమ్‌ లాంటి విలక్షణ నటుడి సరసన నటించే అవకాశం దక్కడంతో మరో ఆలోచన లేకుండా రష్మిక అంగీకరించారట. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని కోలీవుడ్‌ టాక్‌. మరి నిజమేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!