Devotional

శ్రీవారికి కాసుల వర్షం… రికార్డు స్థాయిలో కానుకలు – ఆధ్యాత్మిక వార్తలు

శ్రీవారికి కాసుల వర్షం… రికార్డు స్థాయిలో కానుకలు – ఆధ్యాత్మిక వార్తలు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుని తమకు నచ్చిన కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. దీంతో శ్రీవారికి కానుకల వర్షం కురుస్తోంది. రికార్డు స్థాయిలో శ్రీవారికి భక్తులు కానుకలు సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ మాసంలో నాలుగు సార్లు రూ.5 కోట్లకు పైగా కానుకలు వచ్చాయి. ఈ నెలలో 21 రోజులకే రూ.100 కోట్ల 75లక్షల ఆదాయం వచ్చింది. టీటీడీ చరిత్రలోనే ఈ నెలలో అత్యధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని టీటీడీ భావిస్తోంది. మరోవైపు ఈరోజు ఆగస్ట్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఈరోజు వెయ్యి టోకెన్లను జారీ చేసింది. అలాగే రేపటి నుంచి ఈనెల 26 వరకూ శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి.

1.సుబ్రహ్మణ్య క్షేత్రం…. మోపిదేవి , కృష్ణా జిల్లా
అడికృతిక సందర్భంగా మోపిదేవి లోని వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానం దక్షిణ భారతదేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వరక్షేత్రంగా విరాజిల్లుతోంది.
**స్థల పురాణం
స్కాందపురాణం లోని సహ్యాద్రిఖండం లో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించు సందర్భంలో మోపిదేవి క్షేత్ర ప్రశంస కన్పిస్తోంది.అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరిస్థితుల్లో కాశీని విడిచిపెట్టవలసి వచ్చింది. వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి, ఆకాశంలోకి చొచ్చుకొనిపోయి, సూర్య గమనాన్ని సైతం నిరోధించ సాగింది. ప్రకృతి స్థంభించింది. గ్రహ సంచారాలు నిలిచిపోయాయి.ఈ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్యమహర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమహర్షికి , విషయాన్ని వివరించారు. యోగదృష్టితో సర్వము నెరింగిన మహర్షి తాను ఇప్పుడు కాశీని వీడితే కల్పాంతమైనా తిరిగి కాశీకి రావడానికి వీలుపడదని తెలిసి కూడ లోకశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమరకార్యానికి అంగీకరించాడు. లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో నున్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరించింది. తాను మరలి వచ్చే వరకు అలాగే ఉండమని శాసించి, కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసులో నిలుపుకొని, దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు.
*పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరంలోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. కనకదుర్గామాతను, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు.
“వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్”
అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది,.ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు. ఒకపుట్టనుండి దివ్యతేజస్సుని గమనించి, ఇదే “సుబ్రమణ్య క్షేత్రమని ఇది భుక్తి ము క్తి ఫలప్రదమని “శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. కుమారమూర్తి కే సుబ్రమణ్యమనెడి పేరని మాండవ్యుడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు. కుమారస్వామి ఉరగ (పాము) రూపం లో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధంగా శిష్యులకు వివరించారు అగస్య్తమహర్షి. “సనక,సనకస,సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారుగానే ఉంటారు, పైగా దిగంబరులు. వారు ఎల్లప్పుడూ భగవదారాధనలోనే కాలం గడుపుతుంటారు. వారు ఒక పర్యాయం పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయం లో పరమేశ్వరుడు కైలాసంలో లేడు. లోకమాత పార్వతి,కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. అదేసమయంలో శచీ,స్వాహా మొదలైన దేవతాస్త్రీలు, లక్ష్మీ సరస్వతులు, పార్వతీ దేవి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాలతో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు.“ కుమారా! ఏల నవ్వుచున్నావు ? వారు నేనులా కన్పించలేదా.? ఆ తాపసులు మీ తండ్రి వలే లేరా? భేదమేమైననూ కన్పించినదా ?” యని జగదంబ కుమారుని ప్రశ్నించినది. ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాప పడినాడు. తల్లి పాదాలపై బడి క్షమాపణ కోరుకున్నాడు. తల్లి కాదన్న వినకుండా పాప పరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపం తో తపస్సు ప్రారంభించాడు.
*ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టితో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. పడగవలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు. ” అత్రస్నానం తు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్, “ …. అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్ర తో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి.కాలాంతరంలో ఆ ప్రదేశమంతా పుట్టల తో నిండిపోయింది. ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపంలోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఈతను మహాభక్తుడు. అతనికి స్వామికలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి , ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు. తనవృత్తిని స్వామికి అంకితం చేశాడు. మట్టితో స్వామికి ఇష్టమైన వాటిని తయారు చేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలో భద్రపరచేవాడు. అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయంలో శిథిలమై పోగా మిగిలిన నంది,గుర్రము ఈనాటికీ స్వామి వారి కళ్యాణమండపంలో భద్రంగా ఉండి, భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవి స్ధిరపడిందని చెపుతారు.
*ఆలయప్రత్యేకత.:—–
స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామికి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన ,అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోయడం జరుగు తుంది. ఆలయప్రదక్షిణమార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం.ఇక్కడ స్వామివారి ఆలయంలో పుట్టలో పాలుపోయడం విశేషసేవ గా భక్తులు భావిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలిగించడం, చూపు మందగించినవారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం,మనోవ్యాధి, చర్మసంబంధవ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు.స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీరమ్రొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమౌతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించుకుంటారు.

2.అభిషేకం టికెట్‌ 10వేలు!
ఏడాది ప్యాకేజీకైతే రూ.2.60లక్షలు
‘సోమవారం’ రద్దీని తగ్గించేందుకేనట
వేములవాడ అధికారుల ప్రతిపాదనలు
ప్రస్తుతం టికెట్‌ ధర రూ.వెయ్యి మాత్రమే
పెంపు ప్రతిపాదనలపై భక్తుల మండిపాటు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం రోజున అభిషేకం టికెట్‌ ధరను రూ.10వేలకు పెంచాలని ఆలయ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం రాజన్న క్షేత్రంలో ఏ రోజుకైనా అభిషేకం టికెట్‌ రూ.వెయ్యి మాత్రమే ఉంది. రూ.3వేలు చెల్లించి శాశ్వత అభిషేకం టికెట్‌ పొందిన వారికి ఏడాదికి ఒక సారి చొప్పున పదేళ్లపాటు గర్భాలయంలో అభిషేకానికి అనుమతిస్తున్నారు. అయితే, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోందన్న సాకుతో సోమ, శుక్ర, ఆదివారాల్లో గర్భాలయంలో ఆర్జిత పూజలకు సాధారణ భక్తులను అనుమతించడం లేదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతోపాటు సీఎం పేషీ సిఫారసు చేసిన వారిని మాత్రమే సోమవారం గర్భాలయంలోకి అనుమతిస్తున్నారు. అయితే, వరంగల్‌కు చెందిన ఓ విద్యా సంస్థ అధినేత ఏకంగా 52 శాశ్వత అభిషేకం టికెట్లు కొనుగోలు చేయడంతో ప్రతి సోమవారం గర్భాలయంలో అభిషేక పూజకు అనుమతివ్వడం వివాదాస్పదంగా మారింది. దీంతో ప్రతి సోమవారం అభిషేక పూజ టికెట్‌ ధరను రూ.10వేలకు, ఏడాదిపాటు 52 వారాలకు రూ.2.60లక్షల ప్యాకేజీ నిర్ణయిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌కు అధికారులు ప్రతిపాదనలను పంపినట్లు తెలుస్తోంది. రాజన్న క్షేత్రంలో ఇష్టారాజ్యంగా టిక్కెట్ల ధరల పెంచుతూ ప్రతిపాదించడంపై భక్తులు మండిపడుతున్నారు.

3.షిర్డీ సాయికి రూ. 33 లక్షలతో బంగారు కిరీటం
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మందా రామకృష్ణ(80) షిర్డీ సాయిబాబాకు రూ.33 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని శుక్రవారం అందజేశారు. ఈ విషయాన్ని శ్రీసాయిబాబా సంస్థాన్‌ ట్రస్టు సీఈఓ భాగ్యశ్రీ బనాయత్‌ వెల్లడించారు. ఈ కిరీటం బరువు 707 గ్రాములు. 35 గ్రాముల అమెరికా వజ్రాలను కిరీటంలో పొదిగారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మందా రామకృష్ణ మాట్లాడుతూ.. తాను భార్యతో కలిసి 1992లో షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నానని చెప్పారు.ఆ సమయంలో సాయిబాబా ఆలయ పూజారి ఒక కిరీటాన్ని తమకు చూపించారని అన్నారు. అలాంటి కిరీటాన్నే సాయిబాబాకు అందజేస్తానని తన భార్యకు మాట ఇచ్చానన్నారు. అప్పట్లో తన వద్ద తగినంత డబ్బు లేదని తెలిపారు. ఉద్యోగ విరమణ తర్వాత అమెరికాలో 15 ఏళ్లపాటు వైద్యుడిగా ప్రాక్టీస్‌ చేశానని, అలా వచ్చిన డబ్బుతో కిరీటం తయారు చేయించి, సాయిబాబా పాదాల వద్ద పెట్టానని వివరించారు. డాక్టర్‌ రామకృష్ణ భార్య కొన్ని సంవత్సరాల క్రితమే మృతిచెందారు.