బ్రిటన్ ప్రధాని రేసులో ఇప్పటిదాకా దూసుకుపోయిన భారత సంతతి నేత, మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్.. అనూహ్యంగా వెనుకబడ్డారు. కన్జర్వేటివ్ ఎంపీల మద్దతుతో తుదిపోరులో నిలిచిన రిషికి.. ఆ పార్టీ సభ్యుల నుంచి మాత్రం ఆశించినమేర మద్దతు లభించటం లేదని సమాచారం. ఈ విషయాన్ని రిషి సునాక్ సైతం ధ్రువీకరించారు. తాజాగా బ్రిటన్లోని గ్రాంథాం నగరంలో ప్రసంగించిన సునాక్ తాను వెనుకబడి ఉన్నాననడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. కన్జర్వేటివ్ పార్టీలో కొందరు తన ప్రత్యర్థి, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ను బ్రిటన్ ప్రధానిగా చేయాలని చూస్తున్నారన్నారు. పార్టీ సభ్యుల్లో కొందరు మాత్రం ప్రత్యామ్నాయం కోరుకొంటున్నారని, వారు తన మాట వినేందుకు సిద్ధంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. తుదిపోరులో అండర్డాగ్గా బరిలోకి దిగనున్నట్లు తెలిపారు.
* బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం రిషి సునాక్ను కాకుండా ఇంకెవరినైనా ప్రధాని పీఠం ఎక్కించాలని భావిస్తున్నట్లు అంతర్జాతీయంగా మీడియా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్రిటిష్ అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ ‘యూగవ్’ నిర్వహించిన సర్వే సైతం సునాక్కు వ్యతిరేకంగా వచ్చింది. మొత్తం 730 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను సర్వే చేయగా.. వారిలో 62% ట్రస్ను బలపరిచారు. రిషికి 38% మద్దతిచ్చారు. సభ్యుల్లో మహిళలు – పురుషులు, అన్ని వయోవర్గాల వారు, బ్రెగ్జిట్కు అనుకూలంగా ఓటు వేసినవారిలో అత్యధికులు ట్రస్నే సమర్థించినట్లు యూగవ్ సర్వే తెలిపింది. దీంతో బ్రిటన్ ప్రధాని పీఠాన్ని రిషి అధిరోహిస్తారా? అన్న ప్రశ్నకు నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు పాల్గొన్న వివిధ దశల ఎన్నికల్లో మెజారిటీ సభ్యులు రిషి సునాక్కు అండగా నిలిచారు. ఈసారి జరిగే తుదిపోరులో లక్షా 60 వేల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు బ్రిటన్ ప్రధానిని ఎన్నుకోనున్నారు. ఇందులో ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారే బ్రిటన్ ప్రధాని పీఠం అధిరోహిస్తారు. కాబట్టి, రిషి ఎంతమంది సభ్యుల మద్దతు కూడగడితే ఆయన విజయావకాశాలు అంత మెరుగవుతాయి. దీన్ని బట్టే రిషి ప్రధాని అవుతారా.. లేదా అన్నది తేలుతుంది. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు మెుదటివారం వరకు 12 విడతలుగా తుదిపోరు జరగనుంది.