NRI-NRT

బట్ట తలను కప్పిపెట్టి.. అమెరికా ఉద్యోగం పేరుతొ వధువులకు వల

బట్ట తలను కప్పిపెట్టి.. అమెరికా ఉద్యోగం పేరుతొ వధువులకు వల

ఉన్నత చదువు..అమెరికాలో ఉద్యోగం..అంటూ యువతులను నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకోవడం..మోజు తీరిన తర్వాత ముఖం చాటేయడం. ఈ విషయం తెలిసిన బాధితులు కేసు పెడతామంటే డబ్బులిచ్చి సెటిల్‌మెంట్‌ చేసుకోవడం ఎదురు తిరిగిన వారిని నీలి చిత్రాలు తీసి బెదిరింపులకు పాల్పడడం..ఇది నిత్య పెళ్లికొడుకు బాగోతం. ఇతని మోసాలపై పలువురు బాధితులు గుంటూరు డీఐజీ త్రివిక్రమ వర్మను ఆశ్రయించారు. ఆయన ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఎన్‌ఆర్‌ఐ సంబంధం..అమెరికా తీసుకువెళతాడు :
కర్నాటి సతీష్​బాబు లండన్‌లో ఎంబీఎ చదివి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ ఏడాదిలో ఒకటి, రెండు నెలలు ఇక్కడకు వస్తాడు. ఇంతలో విజయవాడలో ఉన్న అతని తల్లిదండ్రులు 46 ఏళ్ల వయసున్న తమ కుమారుడిని అందంగా ఫొటోలు తీసి పెళ్లి చూపులకు సిద్ధం చేస్తారు. మా కుమారుడు ఎన్‌ఆర్‌ఐ…పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మాయిని అమెరికా తీసుకువెళతాడంటూ నమ్మించి రూ.లక్షల్లో కట్నకానుకలు, వందల గ్రాముల బంగారాన్ని తీసుకొని వివాహం చేస్తారు. అధికమొత్తంలో కట్నకానుకలు ఇచ్చేవాళ్లని తెలిస్తే రెండో సంబంధం అమ్మాయిలైనా ఓకే చెప్పేసి తాళి కట్టేస్తాడు.నీలి చిత్రాలు తీసి బెదిరింపులు! : ఇతగాడికి బట్టతల కావడంతో ఆవిషయం బయటపడకుండా విగ్గుపెట్టి నమ్మించే యత్నం చేస్తాడు. పెళ్లిపీటలపై జిలకర్రబెల్లం పెట్టే క్రమంలో యువతి గుర్తిస్తే తనకు కొద్దిరోజుల కిందట చర్మవ్యాధి రావడంతో జుట్టు ఊడిపోయిందని త్వరలో వచ్చేస్తుందంటాడు. పెళ్లి చేసుకొని అందమైన భవంతిలో సకలభోగాలతో నెల, రెండు నెలలు కాపురం చేస్తాడు. ఆ మహిళల వీడియోలు చరవాణిలో తీసుకుంటాడు. అమ్మాయి అభ్యంతరం చెబితే మాయమాటలు చెప్పి తాను అమెరికా వెళ్లినప్పుడు ఈ గుర్తులు చూసుకోవడానికంటూ ఏమార్చుతాడు. ఆ తర్వాత అమెరికా చెక్కేస్తాడు. ఈ క్రమంలో కొందరు మహిళలు అతని గురించి తెలుసుకొని ప్రశ్నిస్తే డబ్బులిచ్చి సెటిల్‌మెంట్‌ చేసుకుంటాడు. పట్టుబట్టిన వారికి విడాకులు ఇచ్చేస్తాడు. పోలీసు కేసు పెడతామని చెబితే వారి నీలి చిత్రాలు, వీడియోలు బయటపెడతానంటూ బెదిరిస్తుంటాడు.

క్యూ కడుతున్న బాధిత మహిళలు :
ఇతగాడి వలలో చిక్కుకొని మోసపోయిన బాధిత మహిళలు గత రెండు రోజులుగా గుంటూరు దిశ పోలీసుస్టేషన్‌కు క్యూకడుతున్నారు. దిశ సీఐ సురేష్‌బాబు, ఎస్సై నాగుల్‌మీరాలు వారి ఫిర్యాదులను విచారిస్తున్నారు. ఇంతమంది బాధితులున్నారని తెలుసుకొని పోలీసులు నివ్వెరపోతున్నారు. ఇలా 2019లో నమ్మించి రూ.25 లక్షల కట్నం, 50 సవర్ల బంగారం తీసుకొని వివాహమాడి రెండు నెలలకే మోసగించి మాయమైపోయాడని ఎంబీఏ చదివిన పాతగుంటూరుకు చెందిన ఓ యువతి కన్నీటిపర్యంతమైంది. రెండు నెలల కిందట గుంటూరు శ్యామలానగర్‌కు చెందిన తన కుమార్తెను రూ.80 లక్షలు తీసుకొని పెళ్లి చేసుకొని మోసగించాడంటూ బాధితురాలి తండ్రి ఆవేదన చెందాడు. ఈ ఫిర్యాదులపై డీఐజీ స్వీయ పర్యవేక్షణలో ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, ఏఎస్పీ సుప్రజల ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టగా ఇప్పటి వరకు ఇతను సుమారు ఎనిమిది మందిని ఇలా వివాహం చేసుకున్నట్లు గుర్తించారని సమాచారం. హైదరాబాద్‌, సత్తెనపల్లి, విశాఖపట్నం, నరసరావుపేట, పాతగుంటూరుతోపాటు అమెరికాలో ఇద్దరు, లండన్‌లో ఒకరిని వివాహం చేసుకొని ఒక్కొక్కరితో సెటిల్‌మెంట్లు చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలిసింది. కీచకుడిని అరెస్టు చేయటానికి పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ప్రత్యేక దర్యాప్తు అధికారి ఏఎస్పీ సుప్రజను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా బాధితుల ఫిర్యాదుపై లోతుగా, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నమాట వాస్తవమేనన్నారు.రెండు నెలలు వాళ్లతో గడిపి.. అనంతరం నేను అమెరికా వెళ్లాక పాస్‌పోర్టు, వీసా ఏర్పాటు చేసి తీసుకు వెళతానంటూ మాయమైపోతాడు. అలా తమను నమ్మించి పెళ్లి చేసుకొని మోసగించాడంటూ పలువురు బాధితులు గుంటూరు దిశ పోలీసులను ఆశ్రయించారు.

అరెస్ట్​:
నిత్య పెళ్లి కొడుకు కర్నాటి సతీష్​బాబును పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్​ విధించింది.