DailyDose

5 ప్రాంతీయ పార్టీలకు రూ.113.79 కోట్లు.. తెరాస ఖాతాలో ఎంతంటే..?

5 ప్రాంతీయ పార్టీలకు రూ.113.79 కోట్లు.. తెరాస ఖాతాలో ఎంతంటే..?

దేశంలో ప్రాంతీయ పార్టీలకు విరాళాల వరద ఉప్పొంగింది. 2020-21 ఏడాదికి 27 ప్రాంతీయ పార్టీలకు కలిపి 3,051 విరాళాల ద్వారా రూ.124.53 కోట్లు అందాయి. అందులో ఐదు పార్టీల వాటాయే రూ.113.79 కోట్లుగా ఉంది. 2019-20తో పోలిస్తే తమకు విరాళాలు పెరిగినట్లు జేడీయూ, డీఎంకే, తెరాస ప్రకటించాయి. దేశంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రాంతీయ రాజకీయ పార్టీలు దక్కించుకున్న మొత్తం విరాళాల్లో 91% పైగా నిధులు (రూ.113.79 కోట్లు) ఐదు పార్టీల ఖాతాల్లోకే వెళ్లాయి. జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ), ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌), తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఈ జాబితాలో ఉన్నాయి. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) రూపొందించిన తాజా నివేదికలో ఈ మేరకు వివరాలు వెల్లడయ్యాయి. 2020-21లో తమకు అందిన విరాళాలపై ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సంఘానికి అందించిన సమాచారం ఆధారంగా ఏడీఆర్‌ ఈ నివేదికను తయారుచేసింది. అందులోని వివరాల ప్రకారం..
* 2020-21లో 27 ప్రాంతీయ పార్టీలకు కలిపి 3,051 విరాళాల ద్వారా రూ.124.53 కోట్లు అందాయి. అందులో ఐదు పార్టీల వాటాయే రూ.113.79 కోట్లు.
* అత్యధికంగా జేడీయూకు రూ.60.15 కోట్లు (330 విరాళాలు) వచ్చాయి. తర్వాతి స్థానాల్లో డీఎంకే (రూ.33.99 కోట్లు), ఆప్‌ (రూ.11.32 కోట్లు), ఐయూఎంఎల్‌ (రూ.4.16 కోట్లు), తెరాస (రూ.4.15 కోట్లు) ఉన్నాయి.
* 2019-20తో పోలిస్తే తమకు విరాళాలు పెరిగినట్లు జేడీయూ, డీఎంకే, తెరాస ప్రకటించాయి. తమకు ఆ సొమ్ము రాక తగ్గినట్లు ఆప్‌, ఐయూఎంఎల్‌ వెల్లడించాయి.* డీఎంకే, తెరాస, జేడీయూ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌)లకు వచ్చిన విరాళాల శాతం 2019-20తో పోలిస్తే గణనీయంగా పెరిగింది.