WorldWonders

మంకీపాక్స్ అని తెలిసి కూడా ఇండియా వచ్చి మృతి చెందాడు

మంకీపాక్స్ అని తెలిసి కూడా ఇండియా వచ్చి మృతి చెందాడు

దేశంలో తొలి మంకీపాక్స్‌ మరణంపై అనుమానాలు వీడాయి. కేరళ త్రిస్సూర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్‌తోనే మృతి చెందినట్లు కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలతో యూఏఈ నుంచి వచ్చిన యువకుడు మృతి చెందాడన్న విషయం తెలిసే ఉంటుంది. అయితే అతనిలో మంకీపాక్స్‌ వైరస్‌ నిర్ధారణ అయ్యిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణాజార్జ్‌, రెవెన్యూ శాఖ మంత్రి రాజన్‌ సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. యూఏఈ నుంచి జులై 22న సదరు యువకుడు భారత్‌కు తిరిగి వచ్చాడు. ఆపై తన కుటుంబంతో గడిపాడు. స్నేహితులతో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు ఆడాడు కూడా. నాలుగు రోజుల తర్వాత అతనికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ మరుసటి రోజు..అంటే జులై 27న అతను ఆస్పత్రిలో చేరాడు. జులై 28వ తేదీన అతన్ని వెంటిలేటర్‌ మీదకు షిఫ్ట్‌ చేశారు. చికిత్స పొందుతూ.. జులై 30వ తేదీన అతను కన్నుమూశాడు అని తెలిపారు మంత్రి వీణాజార్జ్‌. అయితే.. జులై 19వ తేదీన యూఏఈలోనే అతనికి మంకీపాక్స్‌ టెస్టులు జరిగాయని, భారత్‌కు వచ్చే ముందు రోజు అంటే జులై 21వ తేదీనే పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మంత్రి వీణాజార్జ్‌ తెలిపారు. అయితే ఆ యువకుడు విషయాన్ని దాచిపెట్టి.. మామూలుగానే ఉన్నాడని, భారత్‌కు చేరుకుని చివరికి వైరస్‌ ప్రభావంతో మరణించాడని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.