పాస్పోర్టు బ్లాక్ అవడంతో హైదరాబాద్కు చెందిన యువతి నవ్యదీప్తి ఇబ్బందుల పాలయింది. రెండు రోజుల క్రితం మనీలా వెళ్లిన ఆమెను అక్కడి ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. పాస్పోర్టు బ్లాక్ అయిందని, ఇండియా తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో విమానాశ్రయంలో రాత్రంతా పడిగాపులు పడాల్సి వచ్చింది. ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఆమె మూడేళ్లుగా ఓ ఇంట్లో నివసిస్తోంది. కొవిడ్ సమయంలో ఇంటి యజమాని అధిక డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, ఇవ్వకపోతే పాస్పోర్టు బ్లాక్ చేయిస్తానని బెదిరించాడని, డబ్బు ఇవ్వనందుకు పాస్పోర్టు బ్లాక్ చేశారంటూ ఆమె ఆరోపిస్తున్నారు. ఫిలిప్పీన్స్ పాస్పోర్టు కార్యాలయంలో ఆ ఇంటి యజమాని పనిచేస్తున్నట్లు ఆమె చెబుతోంది. మెడిసిన్ చదువు నిమిత్తం ఆమె మూడేళ్లుగా ఫిలిప్పీన్స్లో ఉంటోంది. కొవిడ్ సమయంలో ఇండియా వచ్చింది. రెండు రోజుల క్రితం అక్కడికి వెళ్లింది. ఆమె లగేజీ ఇవ్వడానికి ఇమిగ్రేషన్ అధికారులు నిరాకరిస్తున్నారు. ఇండియాకు తిరిగి వెళితేనే ఇస్తామంటున్నారని, చదువు అర్ధాంతరంగా ఆగిపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.