Movies

మళ్ళీ తెరపైకి కాజల్

మళ్ళీ తెరపైకి కాజల్

వివాహానంతరం సినిమాల వేగాన్ని తగ్గించింది కాజల్‌ అగర్వాల్‌. తాజాగా ఈ భామ ‘ఇండియన్‌-2’ చిత్రంతో ఇండస్ట్రీకిలోకి రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంది కాజల్‌ అగర్వాల్‌. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘ఇండియన్‌-2’ చిత్రీకరణ గతేడాది ఆగిపోయింది. సెట్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో షూటింగ్‌కు బ్రేక్‌ పడింది.అసలు ఈ ప్రాజెక్ట్‌ ఉంటుందా లేదా అనే సందేహాలు కలిగాయి. సోషల్‌మీడియాలో అభిమానులతో ముచ్చటించిన కాజల్‌ అగర్వాల్‌ తాను సెప్టెంబర్‌లో ‘ఇండియన్‌-2’ షూటింగ్‌లో పాల్గొనబోతున్నానని చెప్పింది. కమల్‌హాసన్‌ నటించిన ‘విక్రమ్‌’ సినిమా ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఇండియన్‌-2’ను తిరిగి సెట్స్‌ మీదకు తీసుకొచ్చేందుకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ‘ఇండియన్‌-2’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కాజల్‌ ఈ సినిమా నుంచి తప్పుకుందని గతంలో వార్తలొచ్చాయి. ఆమె తాజా ప్రకటనతో అవన్నీ పుకార్లేనని తేలిపోయింది.