ఎన్నారై కాలేజీ వ్యవహారంలో మేఘాకు వరుస ఎదురుదెబ్బలు ఆగడం లేదు. మొన్న సుప్రీంకోర్టు స్టేతో ఎదురుదెబ్బ తిన్న మేఘా పంచాయితీ అమిత్ షా దగ్గరకు చేరింది. ట్రైబ్యునల్ నియమించిన జార్ఖండ్ మాజీ డీజీపీ మండవ విష్ణువర్ధన్ రావు.. హోంమంత్రిని కలిశారు. ఎన్నారై కాలేజీలో జరుగుతున్నదంతా పూసగుచ్చినట్లు ఆయనకు వివరించారు. దాదాపు 20 నిమిషాలపాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. స్పెషలాఫీసర్ గా మండవ విష్ణువర్ధన్ రావు నియామకం తర్వాత మేఘా పేట్రేగిపోయింది. వేల కోట్ల రూపాయల కాలేజీని 2 వందల కోట్లకే కోట్టేయాలని చూసిన మేఘా కృష్ణారెడ్డికి ఉచ్చు బిగుస్తున్నట్లుగా అయింది.
2017లో ఎన్నారై కాలేజీని కబ్జా పెట్టేయాలని మేఘా ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్స్ గ్రూపులుగా విడిపోయారు. అనేక గొడవలు జరిగాయి. ఆ తర్వాత పరిష్కార మార్గంగా ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ జార్ఖండ్ మాజీ డీజీపీ మండవ విష్ణువర్ధన్ రావుని స్పెషల్ ఆఫీసర్ గా నియమించింది. కానీ, మేఘా టీం తాము చెప్పిందే నడవాలంటూ.. ఆ అధికారి పై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఇద్దరు ఉద్యోగుల వ్యవహారశైలిని ప్రశ్నించినందుకు మీడియా చేతిలో ఉంది కదా అని నానా రచ్చ చేశారు. పైగా ఆ అధికారిపై క్రిమినల్ కేసులు పెట్టించారు.విష్ణువర్ధన్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కేసులపై ఏం చేయొద్దని స్టే విధించింది.
వేల కోట్ల కాలేజీని తక్కువకే కొట్టేయాలనుకు మేఘా కృష్ణారెడ్డి ప్లాన్ ఆఖరికి బెడిసికొట్టింది. ఇప్పుడు బంతి షా కోర్టులో ఉంది. ఎన్నారైల కాలేజీని కృష్ణారెడ్డి ఎలా కబ్జా పెట్టాడు.. నగదు బదిలీలు ఎలా జరిగాయి.. ఇలా అన్ని వివరాలు స్పెషలాఫీసర్ దగ్గర నుంచి నివేదిక తీసుకున్నారు అమిత్ షా. అలాగే తాను వచ్చినప్పటి నుంచి పెట్టిన ఇబ్బందులను సైతం ఆయన వివరించారు. దీంతో ఈ వ్యవహారంపై అమిత్ షా సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది.
సుప్రీం తీర్పు, షా ఎంట్రీతో మేఘా తోక ముడవడం ఖాయమని భావిస్తున్నారు. వాళ్లు అలా అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఇన్నేళ్లలో జరిగిన అరాచకాలు అన్ని ఉన్నాయి మరి. ప్రశాంతంగా ఉండాల్సిన మెడికల్ కాలేజీలో.. రోజూ ఎదో విధంగా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ వచ్చారు. ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ కాలేజీ పరువును బజారుకు ఈడ్చారు. ఈ తతంగాన్ని ఇన్నాళ్లూ భరించిన ఉద్యోగులు కేంద్రం దృష్టి పెట్టిందని తెలుసుకుని సంబరాల్లో ఉన్నారు.