బహుజన్సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధికారంలోకి వస్తే ప్రవాస తెలంగాణ బిడ్డల కోసం బడ్జెట్లో ఏటా ప్రత్యేకంగా రూ.5000 కోట్ల నిధులు కేటాయిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. తద్వారా వారి ఉపాధి కల్పన, అభివృద్థి, సంక్షేమాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. దుబాయ్ వేదికగా గల్ఫ్ కార్మికులతో జరిగిన బీఎస్పీ ఆత్మీయ అలయ్బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గల్ఫ్ కార్మికుల కోసం దుబాయి డిక్లరేషన్ను ఆయన ప్రకటించారు. వివిధ కారణాలతో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించడంతో పాటు కార్మికుల పిల్లలకు గురుకులాల్లో ప్రత్యేక వసతితో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన చదువును అందిస్తామని తెలిపారు. ప్రతి గల్ఫ్ దేశంలో ఒక తెలంగాణ గల్ఫ్ సెల్ను, టోల్ ఫ్రీ హెల్ప్లైన్ను ఏర్పాటు చేస్తామన్నారు. గల్ఫ్లో చనిపోయిన కార్మికుల మృతదేహాలను రాష్ట్రానికి త్వరగా తీసుకొచ్చేలా ఏర్పాట్లతో పాటు, అంతిమసంస్కారాల కోసం తక్షణ సాయంగా రూ.50వేలు కూడా అందజేస్తామని తెలిపారు.