NRI-NRT

అడ్డంగా బుక్కవుతున్న భారత విద్యార్థులు!

అడ్డంగా బుక్కవుతున్న భారత విద్యార్థులు!

విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని.. తర్వాత ఉద్యోగంలో చేరి అక్కడే స్థిరపడాలని భారతీయు విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. అందుకోసం ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే.. విదేశాల్లో విద్యాభ్యాసం కోసం దరఖాస్తు చేసుకుంటున్న చాలా మంది విద్యార్థులకు వీసాలు లభించడం లేదు. పెద్ద మొత్తంలో అప్లికేషన్లు తిరస్కరణకు గురవుతున్నాయి. కాగా.. భారతీయ విద్యార్థులకు వీసాలు ఎందుకు లభించడం లేదు? విద్యార్థుల వీసా అప్లికేషన్లు ఎందుకు తిరస్కరణకు గురవుతున్నాయనే పూర్తి వివరాల్లోకి వెళితే..

విదేశాల్లో ఏదో ఒక కాలేజీలో సీటు సంపాదించి.. తర్వాత అక్కడే స్థిరపడాలనే ఉద్దేశంతో భారతీయ విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. వీసా పొందటమే ధ్యేయంగా నకిలీ సర్టిఫికెట్లు , బ్యాంకు స్టేట్‌మెంట్ల తో దరఖాస్తు చేసుకుంటున్నారు. చివరికి ఇమ్మిగ్రేషన్ సందర్భంగా అధికారుల వద్ద అడ్డంగా బుక్కవుతున్నారు. ఇలా దొంగ సర్టిఫికెట్లతో వీసాల కోసం అప్లికేషన్లు చేస్తున్న వారిలో పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ముందున్నారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ స్పష్టం చేస్తోంది. 2020-21 ఏడాదిలో ఈ రెండు రాష్ట్రాలకు చెందిన 600 మందికిపైగా విద్యార్థులు ఇమ్మిగ్రేషన్‌లో పట్టుబడ్డట్టు వెల్లడించింది. ఇదే సమయంలో 2500 వీసా అప్లికేషన్లను తిరస్కరించినట్టు కెనడా హై కమిషన్ వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. కెనడా స్టాండింగ్ కమిటీ ఆన్ సిటిజన్ అండ్ ఇమ్మిగ్రేషన్ కీలక విషయాన్ని వెల్లడించింది. 2021లో 2,25,402 స్టడీ వీసా అప్లికేషన్లలో 91,436 దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అంటే దాదాపు 41 శాతం అప్లికేషన్లు రిజెక్ట్ అయినట్టు లెక్క. కొవిడ్ తర్వాత వీటి సంఖ్య భారీగా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. కరోనా ప్రపంచాన్ని కుదిపేయక ముందు.. దాదాపు 15 శాతం దరఖాస్తులు మాత్రమే ఇలా రిజెక్ట్ అయ్యేవని పేర్కొంటున్నారు.