అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు, దాత డా.ముక్కామల అప్పారావు, డా.సుమతి దంపతులు ఔదార్యంతో ఒక అనాథ యువతికి అన్నీ తామై కల్యాణం జరిపించారు. మంగళగిరి మండలం కాజా వద్ద ఉన్న చిన్మయ విజయ ఆశ్రమంలో ఆరేళ్ళ వయసు నుంచి పెరిగిన విమలకు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన రమేష్ తో బుధవారం ఆశ్రమంలో ఘనంగా వివాహం జరిపించారు. విమల విద్యావంతురాలై విజయవాడలోని ఓ వైద్యశాలలో ఉద్యోగం చేస్తున్నారు. వరుడు రమేష్ కేరళలోని చిన్మయ యూనివర్సిటిలో ఐటీ సెక్టార్ మేనేజర్ గా పని చేస్తున్నారు.
వివాహానికి చిన్మయ మిషన్ కు చెందిన ప్రధాన స్వామీజీలు హాజరై వివాహాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం నూతన దంపతుల చేత పాదుకా పూజ నిర్వహింపజేసారు. పలువురు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అధికారులు ఈ వివాహానికి హాజరై డా. అప్పారావు, సుమతి దంపతులను అభినందించారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వ్యవసాయశాఖ ముఖ్య కమిషనర్ శ్రీమతి పూనం మాలకొండయ్య, తానా మాజీ అధ్యక్షుడు డా.నరసరాజు, తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా ,లింగమనేని సంస్థల అధినేత లింగమనేని భాస్కరరావు, ఎన్నారై విద్యా సంస్థల కార్యదర్శి డా. శ్రీధర్, డా.ముక్కామల పార్ధసారధి, డా.మన్నే భవచంద్ తదితరులు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం చక్కటి విందు భోజనాన్ని ఏర్పాటు చేసారు.