DailyDose

ఏపీలో పోలీసును హత్య చేసినా పట్టించుకునే దిక్కే లేదు!

ఏపీలో పోలీసును హత్య చేసినా పట్టించుకునే దిక్కే లేదు!

నంద్యాలలో కానిస్టేబుల్‌ హత్య కేసులో పోలీసులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కానిస్టేబుల్ సురేంద్రకుమార్‌ హత్య జరిగి పదిరోజులు గడుస్తున్నా ఇప్పటివరకూ నిందితులను అదుపులోకి తీసుకోలేకపోయారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విషయంలోనే ఇలా ఉంటే సామాన్య ప్రజల కేసుల విషయంలో ఇంకెలా ఉంటుందని ముక్కున వేలేసుకుంటున్నారు.

** ఆయన ఓ పోలీసు కానిస్టేబుల్‌.. రౌడీషీటర్ల చేతిలో హత్యకు గురై పదిరోజులైంది. అయినా ఇప్పటివరకూ నిందితుల్లో ఒక్కరినీ పోలీసులు పట్టుకోలేకపోయారు. ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని ఏర్పాటుచేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామనే ప్రకటనలే తప్ప.. వారిని అదుపులోకి తీసుకోలేకపోయారు. హత్య జరిగి ఇన్ని రోజులవుతున్నా నిందితులు ఎక్కడున్నారో గుర్తించలేకపోవటం పోలీసుల వైఫల్యమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానిస్టేబుల్‌ హత్య కేసే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటంటున్నారు. అసాంఘిక శక్తులు, రౌడీషీటర్లపై నిఘాలేమి, వారి చర్యల పట్ల ఉదాసీనత, గస్తీ కొరవడటం, శాంతిభద్రతల్ని పట్టించుకోని ఫలితమే తాజాగా నంద్యాలలో కానిస్టేబుల్‌ సురేంద్రకుమార్‌ హత్యకు దారితీసింది. జిల్లాకేంద్రంలోనే ఇంతటి దారుణ పరిస్థితి ఉంటే.. ఇక గ్రామాల్లో ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.

**పారిపోయేంత సమయమిచ్చి…
నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో క్లర్కుగా పనిచేసే కానిస్టేబుల్‌ సురేంద్రకుమార్‌ (35)ను ఆరుగురు హత్య చేసినట్లు ప్రత్యక్షసాక్షి పోలీసులకు తెలిపారు. వారిలో ముగ్గురు రౌడీషీటర్లు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 7వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో టెక్కె మార్కెట్‌ సమీపంలోని టాటూ దుకాణం వద్ద నుంచి పద్మావతి సర్కిల్‌ వరకూ కానిస్టేబుల్‌ను వెంటాడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది.

* పద్మావతి కూడలి వద్ద ఓ ఆటోడ్రైవర్‌ మెడపై కత్తి పెట్టిన రౌడీషీటర్లు… సురేంద్రకుమార్‌ను అందులోకి ఎక్కించి సమీపంలోని చెరువుకట్ట వద్దకు తీసుకెళ్లి అక్కడే కత్తులతో పొడిచి చంపారు. నిందితుల్లో ముగ్గురు ఘటనాస్థలం నుంచే పారిపోగా.. మరో ముగ్గురు అదే ఆటోలో శ్రీనివాస సెంటర్‌లో దిగారు. ఇద్దరు యువకుల్ని చితకబాది వారి ద్విచక్ర వాహనాల్లో పారిపోయారు. వారిలో ఒక రౌడీషీటర్‌ అక్కడినుంచి ఇంటికి వెళ్లి భార్యను కూడా తనతో తీసుకెళ్లాడు. ఈ ఘటనలన్నీ రాత్రి 9-11 గంటల మధ్యే జరిగాయి. పోలీసులు అప్రమత్తంగా ఉంటే.. ఎక్కడికక్కడ తనిఖీలు చేసి నిందితుల్ని వెంటనే పట్టుకునేవారు. కానీ ఆ పరిస్థితే లేకపోవటంతో పారిపోవటానికి వాళ్లకు వీలుచిక్కింది. వెంటనే అప్రమత్తం కాని పోలీసులు.. ఇప్పుడు వారికోసం గాలిస్తున్నామంటున్నారు.

**పోలీసింగ్‌ ఉంటే.. హత్యే జరిగేది కాదు కదా!
టెక్కె మార్కెట్‌ సమీపంలోని టాటూ దుకాణం వద్ద కానిస్టేబుల్‌ సురేంద్రకుమార్‌తో రౌడీషీటర్లు వాగ్వాదానికి దిగి, తర్వాత చంపారు. ఈ క్రమంలో వారు పద్మావతి సర్కిల్‌, టెక్కె మార్కెట్‌, శ్రీనివాస సెంటర్‌లో తిరిగారు. ఇవన్నీ నంద్యాలలో రద్దీప్రాంతాలే. ఇప్పుడు ఆ పట్టణం జిల్లా కేంద్రం. ఏ మాత్రం పోలీసుల ఉనికి, నిఘా, గస్తీ ఉన్నా ఈ హత్య జరిగేది కాదు.

* కానిస్టేబుల్‌ మృతదేహాన్ని ఆటోడ్రైవర్‌ జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చేవరకూ అసలు పోలీసులకు ఆ సమాచారమే తెలియదు. దీన్నిబట్టి పట్టణంలో నిఘాలేమి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. కానిస్టేబుల్‌ హత్య విషయం తెలిసిన తర్వాతైనా పోలీసులు అప్రమత్తమై నిందితుల కోసం గాలిస్తే.. వారు పట్టుబడేవారు. కానీ అదీ సక్రమంగా జరగలేదు.సురేంద్రకుమార్‌ హత్యలో పాల్గొన్న రౌడీషీటర్లకు నేరచరిత్ర ఉంది. అసలు ఆరంభం నుంచే రౌడీషీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించి.. నేర కార్యకలాపాలపై నిఘాపెట్టి అణచివేస్తే కానిస్టేబుల్‌నే చంపేటంత దారుణానికి తెగబడే అవకాశం ఉండేది కాదు. ఇదీ పోలీసుల వైఫల్యమే.

**హోంగార్డు హత్యతోనైనా కళ్లు తెరవని ఫలితం:
ఏడాది వ్యవధిలో నంద్యాలలో 11 హత్యలు, 22 హత్యాయత్నాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 11న మద్యం మత్తులో కొందరు యువకులు హోంగార్డు రాజశేఖర్‌పై దాడిచేయగా.. ఆయన మరణించారు. ఆతర్వాతైనా పోలీసులు కళ్లు తెరవలేదు. నిఘా, గస్తీ అన్నీ గాలికొదిలేశారు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు కానిస్టేబుల్‌ హత్యకు దారితీసింది.సొంతవాళ్లే ఉప్పందించారా?: నంద్యాలలో రౌడీషీటర్ల కదలికలు, వారితో కొందరు పోలీసుల చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న ఘటనలు, సెటిల్‌మెంట్‌ దందాలు తదితర వ్యవహారాలపై సురేంద్రకుమార్‌ ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు చెబుతారని సమాచారం. ఈ విషయం తెలిసి పోలీసు శాఖలోని కొంతమంది అతనిపై కక్షకట్టారా? అనే అనుమానాలు ఉన్నాయి. వారేమైనా రౌడీషీటర్లకు ఉప్పందించారా? నిందితులు తప్పించుకోవటానికి సహకరిస్తున్నారా? అనే సందేహాలున్నాయి.