సత్యప్రమాణాలకు నిలయమైన వరసిద్ది వినాయక క్షెత్రంలో మహాకుంభాభిషేకం వేడుకలు అంగరంగ వైభవంగా వేలాది భక్తుల జయజయ ధ్వానాల మధ్య కనుల పండువగా జరుగుతున్నాయి. ప్రముఖ ప్రవాసాంధ్రులు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్ లు ఈ ఆలయ పునర్నిర్మాణానికి 10కోట్ల విరాళాన్ని అందజేశారు. గత 15వ తేదీ నుండి జరుగుతున్న మహాకుంభాభిషేకం వేడుకలలో గుత్తికొండ శ్రీనివాస్, ఐకా రవి దంపతులు ప్రతినిత్యం పీటల మీద కూర్చొని ఉదయం నుండి సాయంత్రం వరకు జరుగుతున్న పూజలలో పాల్గొంటున్నారు. వచ్చే 21వ తేదీన మహాకుంభాభిషేకం నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా నుండి పలువురు ప్రవాసాంధ్ర ప్రముఖులు ఈ వేడుకలకు హాజరవుతున్నారు. ఐదవ రోజు శుక్రవారం నాడు చతుర్వేద పారాయణంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అస్త్ర హోమం, దిశా హోమం, అగ్నిఒ సంగ్రహణం, యాగశాల నిర్మాణం, గణపతి పూజ, యాగశాల పూజ, ప్రధమ కాల పూజ, హోమము, పూర్ణాహుతి తదితర పూజలు నిర్వహించారు.