తారలకు కావాల్సింది ప్రేక్షకుల ప్రశంసలు. దీనికి తోడు పురస్కారాలూ లభిస్తే బోనస్గా భావిస్తారు. ఇప్పుడీ ఆనందంలోనే ఉంది బాలీవుడ్ తార పరిణీతి చోప్రా. కొన్నేళ్ల కిందట సరైన సినిమాలు లేక, చేసిన సినిమాలకు విజయాలు దక్కక నిరాశలో కూరుకుపోయింది పరిణీతి. ప్రేమలో విఫలమవడం, సఖుడు చేయివ్వడం కూడా ఆమెను కుంగదీసింది. పాండమిక్ తర్వాత ఈ చీకట్ల నుంచి బయటపడింది పరిణీతి చోప్రా. ఆమె కెరీర్ను గాడిన పడేశాయి మూడు వరుస విజయాలు. ‘సైనా’, ‘ద గర్ల్ ఆన్ ద ట్రైన్’, ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’. ఈ మూడు చిత్రాలు వేటికవి భిన్నంగా ఉండి ప్రేక్షకాదరణ పొందడమే కాదు…పేరున్న అవార్డులకూ నామినేట్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పరిణీతి స్పందిస్తూ…‘నా గత మూడు చిత్రాలను ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఇప్పుడు అవార్డులూ దక్కుతున్నాయి. నటిగా నాకు ఇంతకంటే సంతృప్తిని, ప్రోత్సాహాన్ని ఇచ్చేది లేదు. నా మనసుకు నచ్చిన సినిమాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఈ సినిమాలు నిరూపించాయి. ఇకపైనా ఇలాంటి విభిన్నమైన చిత్రాలే ఎంచుకుంటా’ అని చెప్పింది