WorldWonders

సినీఫక్కీలో నెల్లూరు దంపతుల హత్య

సినీఫక్కీలో నెల్లూరు దంపతుల హత్య

నెల్లూరు నగరంలోని పడారుపల్లి సమీపంలోని అశోక్‌నగర్‌లో వాసిరెడ్డి కృష్ణారావు(54), సునీత(50) దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ప్రేమ్‌చంద్, సాయిచంద్‌ ఉన్నారు. వారికి వివాహాలు అయ్యాక వేర్వేరుగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు విశాఖపట్నంలోని పోస్టల్‌ శాఖలో ఉద్యోగి కాగా.. చిన్న కుమారుడు నెల్లూరులోని పొగతోటలో హోటల్‌ నడిపిస్తున్నారు. అశోక్‌నగర్‌లో కృష్ణారావు, సునీత మాత్రమే ఉంటున్నారు. కృష్ణారావు స్థానికంగా కరెంట్‌ ఆఫీస్‌ సెంటరు వద్ద శ్రీరామ్‌ పేరుతో క్యాటరింగ్, హోటల్‌ నడిపిస్తున్నారు. వీరిది ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం. రోజూ కృష్ణారావు హోటల్‌ మూసేసి రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తుండేవారు. శనివారం రాత్రి కూడా భర్త వస్తారని సునీత బయట తలుపులకు తాళం వేయకుండా పడక గదిలోకి వెళ్లి నిద్రపోయారు. అప్పటికే రెక్కీ నిర్వహించిన దుండగులు.. ఇంట్లో మహిళ ఒక్కరే ఉన్నారని తెలుసుకుని లోనికి ప్రవేశించారు. పడక గదిలో నిద్రిస్తున్న సునీత తలపై కర్రతో మోదారు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం దుండగులు బంగారు ఆభరణాలు, నగల కోసం బీరువాలో అన్వేషించినా దొరకలేదు. రెండు లాకర్లలో ఒక లాకరుకు మాత్రమే తాళాలు వేసి ఉంది. తాళాలు లేని లాకరులో హోటల్‌కు సంబంధించిన రోజు వారీ కౌంటరు నగదు ఉండేది. తాళం ఉన్న లాకరులో బంగారం పెట్టేవారు. బంగారం ఉన్న లాకరు ఎంతకీ రాకపోవడంతో దుండగులు వెనుదిరిగారు. ఇంటి నుంచి బయటకు వస్తున్న క్రమంలో వరండా దగ్గరే దుండగులకు కృష్ణారావు ఎదురయ్యారు. వారిని చూసి దొంగలు అంటూ కేకలు పెట్టేలోపే తమతో తెచ్చుకున్న కత్తితో దారుణంగా ఆయన గొంతు కోశారు. దాంతో కృష్ణారావు అక్కడికక్కడే మృతి చెందారు.