ScienceAndTech

145 రోజుల్లో తేలనున్న పోలవరం “నాణ్యత”

145 రోజుల్లో తేలనున్న పోలవరం “నాణ్యత”

పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ సామర్థ్యం తేల్చేందుకు 145 రోజులు పడుతుందని నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) వెల్లడించింది. డయాఫ్రం వాల్‌ సామర్థ్యం తేలిన తర్వాతే.. నిర్మాణం యథావిధిగా కొనసాగించవచ్చా? చిన్నచిన్న మార్పులు సరిపోతాయా? పూర్తిగా కొత్తది నిర్మించాల్సి ఉంటుందా అనే దానిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. గోదావరి నదికి జులై నుంచి భారీ వరదలు పోటెత్తాయి. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య వరద చేరింది. ఆ రెండింటి మధ్యలో రాతిమట్టి కట్టతో డ్యాం నిర్మించాల్సిన ప్రదేశంలోనే డయాఫ్రం వాల్‌ ఉంది. అక్కడ ప్రస్తుతం వరద ఉంది. సామర్థ్య పరీక్షలు చేపట్టే పరిస్థితుల్లేవు. ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గాలంటే సెప్టెంబరు చివరి వరకు ఆగాలి. ఆ తర్వాతైనా కొంత మేర నీటిని ఎత్తిపోస్తేనే పనులు సాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల మధ్య డయాఫ్రం వాల్‌పై నిర్ణయం తీసుకునేందుకు ఎంత లేదన్నా ఫిబ్రవరి వరకు ఆగాల్సి ఉంటుందని అంచనా.