NRI-NRT

బెజవాడ-దుబాయి మధ్య ఎయిరిండియా సర్వీసు

బెజవాడ-దుబాయి మధ్య ఎయిరిండియా సర్వీసు

గల్ఫ్ దేశాలలో ఉంటున్న ప్రవాసాంధ్రుల విజయవాడ విమాన కోరిక ఎట్టకేలకు తీరనుంది. ఇప్పటి వరకు విజయవాడ, విశాఖల నుండి హైద్రాబాద్ వరకు వచ్చి అక్కడి నుండి దుబాయి విమానం ఎక్కవల్సి వచ్చేది, ఇంటర్నేషనల్ లగేజి, వెయిటింగ్ టైం వగైరా అదనం, ఇక నుండి ఈ సమస్యలన్ని తీరుతాయి. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్, కువైత్ మరియు ఒమాన్ దేశాలలో ఉంటున్న కోస్తాంధ్ర ప్రవాసీయుల చిరకాల వాంఛ అయిన విజయవాడ విమాన సర్వీసు సోమవారం నుండి ప్రారంభం కానుంది. ఒమాన్ నుండి హైద్రాబాద్ కు రద్దు చేసిన విమానాన్ని పునరుద్ధరించి హైద్రాబాద్ మీదుగా విజయవాడకు నడుపనున్నారు, అదే విధంగా మరో విమానాన్ని కూడ విజయవాడ మీదుగా కేరళలోని కన్నూరుకు అనుసంధించారు.

​దుబాయి మరియు ఇతర ఏమిరేట్లలో పని చేస్తున్న ప్రవాసాంధ్రుల సౌకర్యార్ధం ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమాన సర్వీసు (ఐఎక్స్ 976) ప్రతి సోమ మరియు శనివారాలు ఉదయం 11 గంటల నుండి షార్జా విమానశ్రాయం నుండి బయలుదేరి భారతీయ కాలమానం 4:25కు విజయవాడకు చేరుకోంటుందని ఏయిర్ ఇండియా గల్ఫ్ విభాగం మేనేజర్ పర్మిందర్ పాల్ సింగ్ వెల్లడించారు. విజయవాడ నుండి సాయంత్రం 6: 35 కు బయలుదేరి యు.ఏ.ఇ కాలమానం రాత్రి 9:05కు షార్జాకు చేరుకోంటుందని ఆయన వివరించారు. ​అదే విధంగా, కువైత్ నుండి ప్రతి బుధ మరియు ఆదివారాలు విమానం (ఐఎక్స్ 894) కువైత్ కాలమానం ప్రకారం ఉదయం 9:05 బయలుదేరి సాయంత్రం నాలుగున్నర గంటలకు విజయవాడకు చేరుకొంటుందని పర్మిందర్ పాల్ సింగ్ చెప్పారు.

​ఒమాన్ రాజధాని మస్కట్ నుండి విజయవాడకు ఐఎక్ 0444 విమానం ప్రతి గురువారం అర్ధరాత్రి 2:50కు బయలుదేరి హైద్రాబాద్ మీదుగా విజయవాడకు చేరుకొంటుందని, మరో విమానం మస్కట్ నుండి ప్రతి మంగళవారం ఉదయం 11:05కు బయలుదేరి విజయవాడకు వెళ్ళి అక్కడి నుండి కేరళలోని కన్నూర్ కు వెళ్తుందని ఏయిర్ ఇండియా ఉన్నతాధికారి చెప్పారు. ఆశించిన విధంగా ప్రయాణికుల సంఖ్య లేకపోవడంతో మస్కట్ – హైద్రాబాద్ విమానాన్ని రెండు రోజులు కూడ రెండు వేర్వేరు నగరాలయిన హైద్రాబాద్, కన్నూర్ ల మీదుగా అనుసంధానం చేసినట్లుగా తెలుస్తోంది. ​విజయవాడకు విమాన సర్వీసులను ప్రారంభించడం పట్ల దుబాయిలోని ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైద్రాబాద్ నుండి దుబాయి వెళ్ళడం సమస్య కాకున్నా విజయవాడ నుండి హైద్రాబాద్ కు ప్రయాణించడం కష్టతరంగా ఉండేదని దుబాయిలోని తెలుగుదేశం పార్టీ నాయకుడు, సామాజిక కార్యకర్త అయిన ఖాదర్ బాషా వివరించారు. లగేజి, వెయిటింగ్ సమస్య అదనంగా ఉండేదని ఆయన అన్నారు.

ద్వైపాక్షిక ఒప్పందంలో భారతదేశం పక్షాన సీట్ల లోటు కారణాన ఏమిరేట్స్ లేదా ఇతర విదేశీ ఏయిర్ లైన్సులకు విజయవాడ లేదా ఇతర నగరాలలో విమాన సర్వీసులను నడపడానికి కేంద్రం అనుమతించడం లేదు. దీంతో ప్రస్తుతానికి ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సేవలు మాత్రమే పరిమితమవుతాయి.