NRI-NRT

సౌదీ క్రీడాపోటీల్లో రాణించిన సింహపురి బాలసింహం

సౌదీ క్రీడాపోటీల్లో రాణించిన సింహపురి బాలసింహం

ఆతిథ్యం, ఔదార్యం, ఆత్మీయతకు తోడు రోషం, పౌరుషం, ప్రతిభ.. ఇవీ సింహపురి సింహాలకు సొంతమైన సిరులు . ఇంటా బయటా.. అన్ని రంగాల్లోనూ ప్రతిభ కనబరిచే వారికి నెల్లూరులో కొదవే లేదు. పెన్నా నదీ తీరాన రంగనాయకుల స్వామి గుడి గోపురం మొదలు అరేబియా సముద్ర తీరాన గల్ఫ్ దేశాల బుర్జ్ ఖలీఫా వరకు.. అటు అంటార్కిటికా.. అమెరికా వరకు ఎక్కడైనా సరే ఆవకాశం లభిస్తే తమ సత్తాను చాటుతారు.

సౌదీ అరేబియా చరిత్రలో ప్రప్రథమంగా సింహపురి బాలుడు ఒకరు క్రీడారంగంలో రాణిస్తూ పోటిపడడమే కాకుండా అందర్నీ ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడంతో పాటు ఒక మిలియన్ రియాళ్ళు ( సుమారు రూ. 2,18,60,000) బహుమానాన్ని కూడా సొంతం చేసుకొని అతి అరుదైన రికార్డును సృష్టించాడు.

నెల్లూరు నగరం రాంలింగపూర్ వీధికి చెందిన శేఖ్ షాహీద్, షాకీరా బేగంల కుమారుడయిన మహాద్ ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సౌదీ అరేబియా జాతీయ క్రీడల్లో బ్యాండ్మీంటన్ పోటీల బాలుర విభాగంలో స్వర్ణ పతకం పొందగా దాన్ని సౌదీ అరేబియా ఒలింపిక్ కమిటీ ఉపాధ్యక్షుడు, సౌదీ క్రీడల డైరెక్టర్ అయిన ప్రిన్స్ ఫహాద్ బిన్ జలవీ బిన్ అబ్దుల్ అజీజ్ బహుకరించారు. సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ క్రీడ పోటీలను నిర్వహిస్తోంది. బాలికల విభాగంలో కేరళకు చెందిన ఖదీజా కొతూరు అనే బాలిక కూడా స్వర్ణ పతకాన్ని సాధించి రికార్డు సృష్టించింది.
1-10f8800cc0
17 ఏళ్ళ మహాద్, ఖదీజా ఇద్దరు కూడా ప్రస్తుతం రియాధ్ నగరంలోని భారతీయ యన్.యం.స్.ఇ పాఠశాలలో పదకొండవ తరగతి చదువుతున్నారు. 5వ తరగతి చదువుతున్నప్పుడు బ్యాడ్మింటిన్ ఆడడానికి తోటి ఆటగాళ్ళు లేక ఇబ్బందులు పడ్డ తాను ఆ రకమైన పరిస్థితి నుంచి నేడు సౌదీ అరేబియా రాజ కుటుంబీకుడి (ప్రిన్స్) చేతుల మీదుగా స్వర్ణ పతకం సాధించినందుకు గర్వపడుతున్నానని మహాద్ చెప్పాడు. హైదరాబాద్‌లోని గోపిచంద్ బ్యాండ్మింటెన్ అకాడమీలో శిక్షణ కూడా పొందుతున్న మహాద్ క్రీడలంటే తనకు పంచప్రాణమని పేర్కొన్నాడు. గోపిచందర్ అకాడమీలో తనకు లభించిన శిక్షణ మెళకువలు అత్యంత అమూల్యమని మహాద్ కొనియాడాడు.

సౌదీ అరేబియా పక్షాన ఒలంపిక్స్ పోటీలలో పాల్గొని విజయం సాధించడం తన లక్ష్యంగా ప్రకటించాడు. తమకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్న పాఠశాల యాజమాన్యానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. సౌదీ అరేబియాతో సహా గల్ఫ్ దేశాలన్ని కూడా ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు అత్యంత అరుదుగా ఇచ్చే తమ దేశాల పౌరసత్వం కూడా ఇవ్వనున్నాయి.

తండ్రి షాహీద్ అర్కిటెక్ట్ కాగా.. తల్లి షాకీరా బేగం ఇంజినీరింగ్ పట్టభద్రురాలు. మహాద్ అన్న ఫైసల్ షా కూడా బ్యాండ్మింటన్ క్రీడాకారుడు. కానీ సరిగ్గా ఆవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం యం.బి.బి.యస్ చదువుతుండగా.. సోదరి ఖతీజా షాహీద్ కూడా ప్రస్తుతం భారతదేశంలో యం.బి.బి.యస్ చదువుతుంది.