NRI-NRT

పుతిన్‌ నోట అణు మాట

పుతిన్‌ నోట అణు మాట

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నోట అణుబాంబు ప్రస్తావన రావడం పశ్చిమదేశాలను కలవరానికి గురిచేస్తోంది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మెక్రాన్‌తో చర్చల్లో పుతిన్‌ ఈ ప్రస్తావన తెచ్చినట్టు బ్రిటన్‌కు చెందిన డైలీ మెయిల్‌ పత్రిక తాజాగా ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులు వేసిన విషయాన్ని మెక్రాన్‌ వద్ద పుతిన్‌ ప్రస్తావించారు. యుద్ధంలో గెలవాలంటే ప్రధాన నగరాలపైనే దాడి చేయాల్సిన అవసరం లేదని పుతిన్‌ పేర్కొన్నారు. అందుకు రెండో ప్రపంచ యుద్ధమే ఒక ఉదాహరణ అని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి అణుబాంబులు ప్రయోగిస్తారనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. పుతిన్‌ తాజా వ్యాఖ్యలు పశ్చిమదేశాల అధినేతలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు రష్యా ఆక్రమిత ఖేర్సన్‌ పట్టణంపై రేడియో ధార్మిక పదార్థాలతో కూడిన బాంబు(డర్టీ బాంబ్‌)లు వేసేందుకు ఉక్రెయిన్‌ కుట్రపన్నినట్టు పుతిన్‌ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణను ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా తోసిపుచ్చారు. రష్యా తాను ఏమైతే చేయాలని కుట్ర పన్నుతుందో.. అదే ఇతర దేశాలు చేస్తున్నాయని ఎదురుదాడికి దిగుతోందని కులేబా ఆరోపించారు.

అణుబాంబు వేసిన ఏకైకదేశం..
యుద్ధంలో అణుబాంబులు వాడిన తొలి, ఏకైక దేశంగా అమెరికా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధంలో 1945 ఆగస్టు 6న జపాన్‌లోని హిరోషిమా పట్టణంపై ‘లిటిల్‌ బాయ్‌’ అనే అణుబాంబును అమెరికా జారవిడిచింది. అదేనెల 9వ తేదీన నాగసాకి పట్టణంపైనా ‘ఫ్యాట్‌ మ్యాన్‌’ అనే అణుబాంబును వేసింది. ఆ బాంబులు వేసిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఇప్పుడు ఉక్రెయిన్‌ యుద్ధం ముగించేందుకు రష్యా కూడా అణుబాంబులు వేసే అవకాశం ఉందని పుతిన్‌ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.

రష్యా తీర్మానానికి భారత్‌ మద్దతు
నాజీయిజంను కీర్తించడాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితిలో రష్యా ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు అనుకూలంగా భారత్‌ ఓటు వేసింది. నాజీ ఉద్యమం, నియో నాజీయిజం, నాజీల స్మారక స్థూపాల ఏర్పాటు, నాజీలను కీర్తిస్తూ బహిరంగ సభలు నిర్వహించడంపై ఈ తీర్మానంలో రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. విస్తృత చర్చ అనంతరం ఈ తీర్మానాన్ని ఐరాస సర్వసభ్య సమావేశం ఆమోదించింది.

యుద్ధ భూమిలోకి క్రిమినల్స్‌
ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించేందుకు 3 లక్షల మంది అదనపు సైనికులను సమీకరించనున్నట్టు రష్యా సెప్టెంబరులో ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా 18,000 మంది అదనపు సైనికులను రష్యా సమీకరించింది. ఈ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు నేరస్థులను సైన్యంలోకి తీసుకొని, శిక్షణ ఇచ్చి, యుద్ధ భూమిలోకి పంపే ఉత్తర్వుపై పుతిన్‌ తాజాగా సంతకం చేశారనే వార్తను అమెరికాకు చెందిన ఓ టీవీ చానల్‌ శనివారం ప్రసారం చేసింది. దీని ప్రకారం హత్య, దోపిడీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా తదితర తీవ్ర నేరాల చరిత్ర ఉన్నవారిని సమీకరిస్తారు