భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నట్లు గత నాలుగైదు రోజుల నుంచి వార్తలు షికారు చేస్తున్న విషయం విదితమే. అయితే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నది నిజమే అని వారి దగ్గరి సన్నిహితుడు ఒకరు ధృవీకరించారు. సానియా, షోయబ్ జంట విడిపోవాలని నిర్ణయించుకున్నారని, అధికారిక ప్రకటనే మిగిలిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఓ టీవీ చానెల్తో షోయబ్ మాలిక్ వద్ద పని చేసే ఒక మెంబర్ మాట్లాడుతూ ఈ విషయాన్ని నిర్ధారించారు. అవును, వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అంతకంటే ఎక్కువ విషయాలను తాను మాట్లాడలేనని ఆయన స్పష్టం చేశారు. కానీ వారిద్దరూ విడిపోయారని నిర్ధారించగలను అని పేర్కొన్నారు.
సానియా మీర్జా ప్రస్తుతం దుబాయ్లో ఉండగా, మాలిక్ పాకిస్తాన్లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో సానియా తాజాగా చేసిన ఓ పోస్టు ఆ ఇద్దరి వైవాహిక బంధంలో సమస్యలు ఉన్నట్లు స్పష్టం చేస్తోంది. సానియా తన ఇన్స్టాలో చేసిన పోస్టు ఆమె అభిమానుల్లో ఆందోళన కలిగించింది. పగిలిన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి.. అల్లాను చేరేందుకేనా అంటూ సానియా తన ఇన్స్టాలో ఓ పోస్టు చేసింది. నిజానికి సానియా, మాలిక్ మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ పాకిస్థాన్లోని మీడియా నివేదికల ఆధారంగా.. సానియాను షోయబ్ చీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాలిక్, సోనియా విడిపోయారని, ఆ ఇద్దరూ ప్రస్తుతం వేర్వేరుగా జీవిస్తున్నట్లు పాక్ మీడియా పేర్కొన్నది.
షోయెబ్, సానియా జంటకు ఓ కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం సానియా వద్ద నాలుగేళ్ల ఇజాన్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇద్దరి మధ్య వచ్చిన స్పర్థలకు సంబంధించి ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఎటువంటి విషయాన్ని వెల్లడించలేదు. 2010లో సానియా, షోయెబ్ పెళ్లి ఘనంగా జరిగింది.
ఇజాన్ మాలిక్ బర్త్డేను ఇటీవల దుబాయ్లో జరుపుకున్నారు. ఆ ఫోటోలను మాలిక్ తన ఇన్స్టాలో షేర్ చేశాడు. కానీ సానియా మీర్జా మాత్రం ఆ ఫోటోలను షేర్ చేయలేదు. తాజాగా సానియా తన ఇన్స్టాలో చేసిన పోస్టు కొంత అర్ధంకాని తీరిలో ఉన్నా.. కొన్ని రోజుల క్రితం చేసిన మరో పోస్టు కూడా భిన్న భావాన్ని వ్యక్తం చేసింది.