Politics

ఏపీని సహృదయంతో ఆదుకోవాలి : జగన్

ఏపీని సహృదయంతో ఆదుకోవాలి : జగన్

దేశ ప్రగతి రథసారథి నరేంద్ర మోదీ అని, సహృదయంతో ఏపీని అన్ని విధాల ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.శనివారం విశాఖపట్నం ఏయూ ప్రాంగణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీతో వేదిక పంచుకున్నారాయన. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రసంగించారు.

విశాఖలో జనసముద్రం కనిపిస్తోంది. దేశ ప్రగతి సారథి ప్రధాని నరేంద్ర మోదీగారికి స్వాగతం. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల్లా జనం ఇక్కడికి తరలి వచ్చారు. వంగపాడు పాట ‘ఏం పిల్లడో ఎల్దామొస్తవా..’ అనే పాటలా జనం తరలివచ్చారు. జగన్నాథ రథచక్రాలు ఇక్కడికి కదిలి వచ్చాయి. దాదాపు పది వేల కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టులు ప్రారంభిస్తున్న ప్రధాని మోదీకి.. రాష్ట్ర ప్రభుత్వం, అశేష జనం తరపున ధన్యవాదాలు.

ఈ మూడున్నరేళ్లలో ఏపీ సంక్షేమం, అభివృద్ది దిశగా దూసుకెళ్లింది. విద్య, వైద్యం, సాగు, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమం, అభివృద్ధి, సంక్షేమం, గడప వద్దకే పరిపాలన మా ప్రాధాన్యతలు అయ్యాయి. ప్రతి కుటుంబం నిలదొక్కుకునేందుకు మా అర్థిక వ్యవస్థలో ప్రతీ రూపాయి ఖర్చు చేశాం. వీకేంద్రీకరణ, పాదర్శకతతో పాలన కొనసాగిస్తున్నాం.

నిలదొక్కుకునేందుకు ఏపీ ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతం. మాకు మరో ఎజెండా లేదు.. ఉండబోదు. రాష్ట్రాభివృద్ధికి మీ సహాయ సహకారాలు మరింత కావాలి. ఎనిమిదేళ్ల కిందటినాటి విభజన గాయం నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదు. విభజన హామీలైన పోలవం, రైల్వేజోన్‌, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి.. ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలని కోరుతున్నాం. పెద్దలు సహృదయులైన మీరు(ప్రధానిని ఉద్దేశిస్తూ..) మమ్మల్ని ఆశీర్వదించాలి. ఏపీని తగిన విధంగా కేంద్రం ఆదుకోవాలి. మీకు చేసిన విజ్ఞప్తులను పరిష్కరించాలని మరోసారి కోరుతున్నాం అని సీఎం జగన్‌.. ప్రధాని సమక్షంలోనే విజ్ఞప్తి చేశారు