DailyDose

పిల్లలకు బండి ఇస్తే మీరే జైలుకెళ్తారు

పిల్లలకు బండి ఇస్తే మీరే జైలుకెళ్తారు

దేశంలో రోడ్డుప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ను అమలు చేయడంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అతివేగం, హెల్మెట్, లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చేస్తే భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నారు. ఇక పిల్లలకు వాహనం ఇచ్చి ముచ్చటపడుతున్నారంటే జైలుకు వెళ్లే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు. మీ వాహనం తీసుకెళ్లి వేరేవాళ్లు యాక్సిడెంట్ చేస్తే.. మీకూ చిక్కులు తప్పవని చెబుతున్నారు.మైనర్లు వాహనం నడపడం ప్రమాదాలకు దారితీస్తుందనే ఉద్దేశంతో దీనిపై ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. వాహనం నడుపుతూ మైనర్లు పట్టుబడితే సదరు వాహనదారుడికి రూ.25 వేల జరిమానా విధిస్తారు. ఈ మొత్తాన్ని 15 రోజుల్లో కట్టాల్సిందే! పట్టుబడ్డ ఆ మైనర్ కు పాతికేళ్లు వచ్చేదాకా దేశంలో ఏ ఆర్టీఏ కార్యాలయంలోనూ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. మైనర్ వాహనం నడుపుతూ యాక్సిడెంట్ చేస్తే మూడేళ్ల జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. వాహనం యజమానికీ జరిమానా, మూడేళ్ల జైలు విధించే అవకాశం కూడా ఉంది. అందుకే పిల్లలు పెరిగి, డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకునేదాకా బండి, కారు ఇచ్చి బయటకు పంపొద్దని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.