DailyDose

దగ్గు మందుతో మరణాలు సిగ్గుచేటు

దగ్గు మందుతో మరణాలు సిగ్గుచేటు

ఇక్కడ తయారైన దగ్గు మందుతో జాంబియా దేశంలో 66 మంది చిన్నారులు మరణించినట్లు ఆఫ్రికా ఆరోపించడం భారత్‌కు సిగ్గుచేటని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. మంగళవారం బెంగళూరులో ఇన్ఫోసిస్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ పురస్కారాల ప్రకటన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనా టీకాలను తయారు చేసి, విదేశాలకు ఎగుమతి చేసినా దగ్గు మందు అపవాదు భారత పరిశోధన రంగానికి మచ్చ తెచ్చేదేనని అభిప్రాయపడ్డారు. విజ్ఞాన పరిశోధనల్లో సమన్వయ లోపంతోపాటు నిధులు పొందడంలో విద్యా సంస్థలు అవస్థలు పడుతున్నాయని, అవి ప్రభుత్వ ప్రోత్సాహకాలను సకాలంలో పొందలేకపోతున్నాయని విశ్లేషించారు. భారతీయ సమాజం ఎదుర్కొనే గన్యా, డెంగీలకు ఇంకా టీకాలు కనుగొనకపోవడం పరిశోధన రంగం వైఫల్యమేనని పేర్కొన్నారు.
**ఆరుగురికి పురస్కారం: అత్యుత్తమ పరిశోధనలు, యువతకు స్ఫూర్తి కలిగించిన ఆరుగురు శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ పురస్కారాలు ప్రకటించింది. సుమన్‌ చక్రవర్తి (ఇంజినీరింగ్‌ కంప్యూటర్‌ సైన్స్‌), సుధీర్‌ కృష్ణస్వామి (హ్యూమనిటీస్‌), విధిత వైద్య (లైఫ్‌ సైన్సెస్‌), మహేశ్‌ కాక్డే (గణితం), నిస్సీమ్‌ కనేకర్‌ (భౌతిక శాస్త్రం), రోహిణి పాండే (సోషల్‌ సైన్స్‌)లకు పురస్కారాలను ప్రకటించారు. విజేతలకు స్వర్ణ పతకంతోపాటు లక్ష అమెరికన్‌ డాలర్లు ఇస్తారు. ఈ ఏడాది మొత్తం 218 నామినేషన్లు రాగా వీరిని ఎంపిక చేశారు. జనవరిలో పురస్కారాలు అందజేస్తామని ఫౌండేషన్‌ అధ్యక్షుడు క్రిస్‌ గోపాలకృష్ణన్‌ ప్రకటించారు.