NRI-NRT

భారతీయులకు రిషి సునాక్ శుభవార్త!

భారతీయులకు రిషి సునాక్ శుభవార్త!

బ్రిటన్‌లో పని చేయాలని గంపెడు ఆశలు పెట్టుకున్న భారతీయ యువ ప్రొఫెషనల్స్‌‌కు బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ బుధవారం శుభవార్త చెప్పారు. ఏటా 3,000 మందికి వీసాలు మంజూరు చేయనున్నట్లు బ్రిటన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ట్వీట్‌లో వెల్లడించింది. ఈ పథకంలో లబ్ధి పొందే మొదటి వీసా నేషనల్ కంట్రీ భారత దేశమేనని తెలిపింది. గత ఏడాది ఇరు దేశాల మధ్య కుదిరిన యూకే-ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్‌షిప్ క్రింద ఈ పథకాన్ని రూపొందించారు. రిషి సునాక్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని బాలిలో జీ20 సదస్సుకు మంగళవారం హాజరై, ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్న కొద్ది గంటల తర్వాత ఈ పరిణామాలు జరిగాయి.

యూకే పీఎం కార్యాలయం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘నేడు యూకే-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కన్‌ఫర్మ్ అయింది. 18-30 ఏళ్ళ వయసుగల, డిగ్రీ విద్యార్హతగల 3,000 మంది ఇండియన్ నేషనల్స్ బ్రిటన్‌కు వచ్చి, రెండేళ్ళపాటు నివసిస్తూ, పని చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాం’’ అని పేర్కొంది. బ్రిటన్, భారత దేశం ద్వైపాక్షిక సంబంధాలకు ఈ పథకం చాలా ముఖ్యమైనదని తెలిపింది. ఇండో-పసిఫిక్ రీజియన్‌తో బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి బ్రిటన్‌ నిబద్ధతతో కృషి చేస్తున్నట్లు తెలిపింది. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడానికి ఇది దోహదపడుతుందని పేర్కొంది. ఇండో-పసిఫిక్ రీజియన్‌లోగల దేశాల్లో దాదాపు ఏ దేశంతోనూ లేనంత గొప్ప సంబంధాలు భారత దేశంతో ఉన్నాయని పేర్కొంది. బ్రిటన్‌లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో దాదాపు నాలుగో వంతు మంది భారత దేశం నుంచి వచ్చినవారేనని తెలిపింది. బ్రిటన్‌లో భారతీయ పెట్టుబడుల వల్ల దేశవ్యాప్తంగా 95,000 ఉద్యోగావకాశాలు వచ్చినట్లు పేర్కొంది.

రిషి బ్రిటన్ ప్రధాన మంత్రి పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం బ్రిటన్, భారత్ మధ్య వ్యాపార ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే ఓ యూరోపియన్ దేశంతో భారత్ ఇటువంటి ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య 24 బిలియన్ పౌండ్ల వ్యాపారం జరుగుతోంది. భారత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుండటం వల్ల వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి బ్రిటన్‌కు వీలవుతుంది.

భారత దేశంతో బ్రిటన్‌కుగల చారిత్రక, సాంస్కృతిక సంబంధాల గురించి తనకు తెలుసునని రిషి చెప్పారు. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు, సమాజాలు సుసంపన్నం కావడానికి అవకాశం కలుగుతుందన్నారు