Business

19న బ్యాంకు ఉద్యోగుల సమ్మె..ఆ సేవలపై ప్రభావం

19న బ్యాంకు ఉద్యోగుల సమ్మె..ఆ సేవలపై ప్రభావం

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్‌ ఉద్యోగుల సంఘం నవంబర్‌ 19న (మూడో శనివారం) సమ్మెకు పిలుపునిచ్చింది.దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకులు మాత్రం యథాతథంగా పనిచేయనున్నాయి.ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకం వల్ల ఖాతాదారుల సొమ్ముకు, భద్రతకు విఘాతం కలుగుతుందని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (AIBEA) ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం అన్నారు. ఈ విధానాల వల్ల ఉద్యోగాలతో పాటు, ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందన్నారు. అందుకే తమ ఆందోళన తెలియజేసేందుకు ఒక్కరోజు సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సమ్మెలో బ్యాంక్‌ ఉన్నతోద్యోగులు పాల్గొనడం లేదు. కేవలం కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే ఆందోళన చేపట్టనున్నారు. దీంతో క్యాష్‌ డిపాజిట్‌, విత్‌డ్రా, చెక్‌ క్లియరెన్స్‌ వంటి సేవలపై ప్రభావం పడనుంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ సింధ్‌ బ్యాంక్‌ ఇప్పటికే తమ ఖాతాదారులకు ఈ విషయమై సమాచారం ఇచ్చాయి. ఒకవేళ ప్రభుత్వ బ్యాంకుల్లో పని ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది.