మధ్యప్రదేశ్: అక్కడ పొక్లెయిన్ యంత్రాలు, కాంక్రీటు మిక్సింగ్ వాహనాలు, భారీ ట్రాలీలు ఉంటాయి. పదుల సంఖ్యలో జనాలు బిజీ బిజీగా కనిపిస్తారు. ఇదంతా చూస్తే అక్కడేదో నిర్మాణ పనులు జరుగుతున్నాయనిపిస్తుంది. కానీ ఆ హడావుడి అంతా వంటలు చేయడానికి! 40 టన్నుల పిండి, వందల కిలోల బెల్లం, క్వింటాళ్ల కొద్దీ కూరగాయలు, అతిపెద్ద వంట పాత్రలు.. మధ్యప్రదేశ్ భిండ్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం దంద్రౌవా ధామ్ వద్ద కనిపించే దృశ్యమిది.
ఈ క్షేత్రానికి లక్షల మంది భక్తులు వస్తుంటారు. వారందరికీ సరిపోయే విధంగా వంటలు చేసేందుకు భారీ యంత్రాలనే ఉపయోగిస్తుంటారు. పిండి కలపడానికి కాంక్రీట్ మిక్సర్, వంట పదార్థాలను ఇతర పాత్రల్లోకి మార్చడం కోసం పొక్లెయిన్లను, వాటిని తరలించడానికి ట్రాలీలను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ వినియోగించే ఓ పాత్ర రాష్ట్రంలోనే అతిపెద్దది కావడం విశేషం. దంద్రౌవా ధామ్లో ప్రస్తుతం ప్రముఖ కథకుడు ధీరేంద్ర కుమార్ శాస్త్రి పురాణ కథలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడకు తరలివస్తున్నారు. వీరికి ప్రసాదం, భోజనాలు చేసేందుకే ఈ స్థాయిలో వంటలు చేస్తున్నారు.