ఒకవేళ 2024లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాకుంటే, ఇక తనకు అదే చివరి ఎన్నిక అవుతుందని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూల్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్షోలో భావోద్వేగంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడుతానని గతంలో చంద్రబాబు ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.
నేను తిరిగి అసెంబ్లీకి వెళ్లాలన్నా, నేను రాజకీయాల్లో ఉండాలన్నా, ఏపీకి న్యాయం జరగాలన్నా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలని, లేదంటే అదే తనకు చివరి ఎన్నిక కానున్నట్లు చంద్రబాబు తెలిపారు. మీరు నన్ను దీవిస్తారా, నన్ను నమ్ముతున్నారు కదా అని బాబు రోడ్షోలో అన్నారు
*జనం జోలికి వస్తే తాట తీస్తా… పోలీసులకు చంద్రబాబు హెచ్చరిక
ఆదోనిలో జరుగుతున్న రోడ్షోలో పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం జోలికి వస్తే తాటతీస్తానంటూ హెచ్చరించారు. ఆదోని పోలీసు కంట్రోల్ రూమ్ సర్కిల్లో చంద్రబాబు రోడ్ షో కొనసాగుతోంది. పూలు చల్లి.. బానసంచా కాల్చుతూ చంద్రబాబుకు జనం నీరాజనం పలుకుతున్నారు. చేతిలో పసుపు జెండా పట్టుకుని చంద్రబాబు కు అభివాదం చేస్తున్నారు. బాబు కాన్వాయ్ వెంట జనం కిక్కిరిశారు. యువతీ యువకులు, మహిళలు… టీడీపీ అధినేతను సెల్ ఫోన్లో ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. చంద్రబాబు కాన్వాయ్ వెంట నడుస్తున్న జనాన్ని కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీలతో కొట్టారు. దీంతో పోలీసులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం జోలికి వస్తే తాట తీస్తానంటూ పోలీసులను చంద్రబాబు హెచ్చరించారు