ముందున్న సంక్లిష్ట సమయాన్ని అధిగమించేందుకు ఉద్యోగులు శ్రమించాలని, ట్విట్టర్ 2.0ను నిర్మించేందుకు ఉద్యోగులు అహరహం శ్రమించాలని మైక్రోబ్లాగింగ్ సైట్ అధినేత ఎలన్ మస్క్ కోరారు. సుదీర్ఘ పనిగంటల్లో ఉద్యోగులు సంస్ధ కోసం వెచ్చించాలని అన్నారు. ఉద్యోగులంతా గురువారంలోగా ఇందుకు అంగీకరించాలని లేనిపక్షంలో వారికి మూడు నెలల వేతనంతో కూడిన పరిహార ప్యాకేజ్తో ఇంటికి సాగనంపుతామని మస్క్ తేల్చిచెప్పారు.
ట్విట్టర్ 2.0 నిర్మించే క్రమంలో పోటీ ప్రపంచంలో మనగలిగేందుకు మనం కష్టపడి పనిచేయాలని, అంటే ఎక్కువ పనిగంటల్లో తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉందని మస్క్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో స్పష్టం చేశారు. అద్భుత సామర్ధ్యం కనబరిస్తేనే రేసులో ఉంటామని అన్నారు. ట్విట్టర్లో డిజైన్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ కీలకమని, మెరుగైన కోడ్ రాసేవారు సైతం మన టీంలో అధికంగా ఉన్నారని చెప్పారు.
మీరు సరికొత్త ట్విట్టర్లో పాలుపంచుకోవాలంటే ఈ లింక్లో ఉన్న ఫాంను గురువారంలోగా నింపాలని కోరారు. ఈ పని చేయని వారు మూడు నెలల వేతనం తీసుకుని కంపెనీ నుంచి వైదొలగుతారని తేల్చిచెప్పారు. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ట్విట్టర్ను బలోపేతం చేసేందుకు మీ కృషకి ధన్యవాదాలంటూ మస్క్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో రాసుకొచ్చారు.