NRI-NRT

ఎమిరేట్స్‌లో వైభవంగా ఎన్నారైల కార్తీకమాస వనభోజనం

ఎమిరేట్స్‌లో వైభవంగా ఎన్నారైల కార్తీకమాస  వనభోజనం

అన్ని మాసాలయందు కార్తీక మాసం ఉత్తమం. దానికి సమానమైన మాసమేదీ లేదు. ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ చేసే దేవుడి ఆరాధాన విశిష్టమైంది. కార్తీకంలో శివుడికి అలంకారాలతో, రాజోపరాచాలతో, నైవేద్యాలతో పనిలేదు. కార్తీకంలో వివిధ దేశాల్లోని తెలుగు కుటుంబాలు ఏ దేశమేగినా ఎందు కాలిడినా అన్నట్టు.. కార్తీక కర్తవ్యాన్ని తప్పక నిర్వహిస్తారు. అది నిస్సారమైన ఎడారయినా లేదా పచ్చని పొదల ఉద్యానవనాలైనా మరో ప్రదేశమైనా భక్తి, ఆరాధనకు అడ్డంకి కాదు.సదా పని ఒత్తిడి, కిక్కిరిసిన రోడ్లపై ట్రాఫీక్, నిద్ర లేమితో దుబాయి ఆకాశ హర్మ్యాల మధ్య యాంత్రిక నగర జీవనానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో దుబాయి, రాస్ అల్ ఖైమాలలోని ప్రవాసీ తెలుగు కుటుంబాలు(Telugu NRIs) తెలుగు తరంగిణి, తెలుగు అసోసియేషన్ సంఘాల ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలను ఆదివారం ఆత్మీయంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించాయి.

రాస్ అల్ ఖైమాలోని సువిశాలమైన అల్ సఖర్ పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో తులసి, ధాత్రి (ఉసిరి), మారేడు, అశ్వత్ద తదితర దేవత వృక్షాలను శోభారాణి సమకూర్చగా దానికి అందరు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. తులసీ మాతకు హారితి ఇచ్చి కార్తీక దీపాలను వెలిగించిన అనంతరం సురేశ్ – శోభారాణిల కూతురు పదిహేనేళ్ల కుమారి భార్గవి శ్లోక పఠనంతో అక్కడి వారి పరవశించిపోయారు. అందరు కలిసి అరిటాకులలో చేసిన సహపంక్తి భోజనాలు ఆత్మీయతను పంచాయి. అంతర్జాతీయ కృష్ణ తత్వ సమాఖ్య (ఇస్కాన్) ప్రతినిధులు కార్తీక మాసం ప్రాముఖ్యతను వివరించారు.
2-0dc1de5678-V-jpg-799x414-4g
తన వాక్చాతుర్యంతో మాటాల గారడిగా పేరోంది దుబాయిలో వివిధ తెలుగు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించే ముసునూరి మైథిలీ మోహాన్ ఇక్కడ కూడా తన చరుతతో సందర్భానుసారంగా వ్యాఖ్యానాలు చేస్తూ ఆహుతులను ఉత్సాహపరిచారు. ఉండమ్మా బొట్టు పెడుతా అనే కార్యక్రమం అందర్నీ ఆకర్షించగా అందులో కృష్ణ ప్రియ, శ్రీలత ప్రథమ, ద్వితీయ బహుమతులను గెలుచుకున్నారు. బాండ్ బంధన్‌లో ఆశా రాణి, పావని విజయలక్ష్మి, ఫ్యాన్సీ డ్రెస్ పోటిలలో సహాస్ర, పునవ్, జాస్వీన్‌లు బెలూన్ పోటీలలో అంశులా, గోపాల్, రాణి, వెంకట్, సతీష్, దివ్య, బాలుర బెలూన్ పోటీలలో అభినవ్ ఇతర పోటీలలో విజేతలుగా నిలిచిన అఖిల, హేమ, భువనేశ్, మెహర్ శాశంక్‌కు బహుమతులు ప్రదానం చేసారు.

తెలుగు తరంగిణి అధ్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేశ్, ఉపాధ్యక్షులు యం.వి.యస్.కె. మోహన్, కార్యదర్శి కోకా సత్యానంద కోశాధికారి చామర్తి రాజేశ్ దిరిశాల ప్రసాద్ తెలుగు అసోసియేషన్ పక్షాన దినేష్, మసీయోద్దీన్, బలుస వివేకానంద తదితరులు కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్‌లోని శ్రీ వాసవి గ్రూప్, జాయ్ లుకాస్, మల్బార్ గోల్డ్ స్పాన్సర్లుగా వ్యవహరించారు. కార్తీక మాసం మొదలయినప్పటి నుండి ఎమిరేట్స్‌లోని తెలుగు సంప్రదాయక తెలుగు కుటుంబాలన్నీ కూడా తమ భక్తి పారవశ్యాన్ని ఆనందోత్సవాల మధ్య చాటుతున్నారు. వ్యక్తిగతంగా తమ తమ ఇళ్ళలో సహస్ర లింగార్చన తదితర ధార్మిక కార్యక్రమాలను జరుపుకోంటున్నారు.